న్యూఢిల్లీ: ఐసీసీ టోర్నీల్లో విఫలమైనంత మాత్రాన టీమిండియాను చోకర్స్ అని పిలవడం సరికాదని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. 2013లో ధోనీ సారథ్యంలో చివరిసారిగా ఐసీసీ టైటిల్ గెలిచిన టీమిండియా.. గత 10 ఏళ్లుగా నిరాశపరుస్తూనే ఉంది. కీలక టోర్నీల్లో సెమీఫైనల్, ఫైనల్లో ఓటమిపాలవుతోంది. ఈ క్రమంలోనే విమర్శకులు టీమిండియాకు చోకర్స్ ట్యాగ్ను తగిలిస్తున్నారు.
కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే జట్లను ఉద్దేశించి క్రికెట్ పరిభాషలో 'చోకర్స్'గా అభివర్ణిస్తారు. అయితే టీమిండియాకు ఈ ట్యాగ్ తగిలించడం సరికాదని రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడుతూ.. టీమిండియా బలమైన జట్టని, ఇటీవల జరిగిన ఐసీసీ టోర్నీల్లో సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు వెళ్లిందని గుర్తు చేశాడు.

'టీమిండియాను చోకర్స్ అంటే నేను ఒప్పుకోను. మూడు ప్రపంచకప్లు గెలిచే అవకాశం ఉన్న రెండు జట్లు భారత్, ఆస్ట్రేలియా మాత్రమే. పెద్ద టోర్నీల్లో మనం బోల్తా పడుతున్నామని కాదు. మనం సెమీఫైనల్స్కు చేరుకున్నాం. ఫైనల్స్ ఆడాం. ఐసీసీ టోర్నీల్లో విఫలమైనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు.
పెద్ద టోర్నీల్లో గెలవాలంటే సమష్టిగా రాణించాల్సిందే. టీమ్ వైఫల్యాలకు ఒక వ్యక్తినో.. సారథినో నిందించవద్దు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ వంటి టోర్నీల్లో విజేతగా నిలవాలంటే బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్లు ఆడాలి. శతకాలు నమోదు చేయాలి. అప్పుడే బౌలర్ల పని సులవవుతోంది. ట్రోఫీ గెలుచుకునే అవకాశాలు లభిస్తాయి.
టీ20, టెస్ట్, వన్డేలు ఏ ఫార్మాట్ అయినా.. బ్యాటర్లు సెంచరీ చేయలేకపోతే.. కనీసం మూడు హాఫ్ సెంచరీలు ఉండేలా చూసుకొండి. అలా చేయకపోతే.. మీకు గెలిచే అర్హత లేదు.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న టీమిండియా.. వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ వెస్టిండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇప్పటికే టెస్టు, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ.. త్వరలోనే టీ20 టీమ్ను ఎంపిక చేయనుంది.