
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించిన భారత్.. మరో మ్యాచ్లో విజయం సాధించినా.. చివరి రెండు టెస్ట్లను డ్రా చేసుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫలితంపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0 తేడాతో క్లీన్స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్తో తలపడినా భారత్కే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని జోస్యం చెప్పాడు.
'బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0 తేడాతో క్లీన్స్వీప్ చేస్తే అది ప్రత్యర్థిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ, ఇంగ్లండ్లో పరిస్థితులు టీమిండియాకు అనుకూలంగా ఉండవు. అక్కడి పరిస్థితులు ఆసీస్కు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే గాయాలపాలై జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా ఫాస్ట్బౌలర్లు జట్టుకు అందుబాటులోకి వస్తారు. కానీ, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ క్లీన్స్వీప్ విజయం ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో కూడా ఆసీస్ను ఓడించగలమనే ఆత్మవిశ్వాసం భారత్కు ఇస్తుంది.' అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
జూన్లో లండన్లోని ఓవల్ మైదానం వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ప్రస్తుత పాయింట్స్ టేబుల్ ప్రకారం ఫైనల్లో ఆసీస్, భారత్ మాత్రమే తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆసీస్ భారత్తో చివరి రెండు టెస్ట్లు ఓడి.. శ్రీలంక న్యూజిలాండ్ జరిగే సిరీస్ను 2-0తో గెలిస్తే ఆ జట్టుకు అవకాశం ఉంటుంది. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సైతం.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0తో గెలుస్తుందని చెప్పాడు. సొంతగడ్డపై భారత్ను ఓడించడం ఆసీస్ వల్ల కాదన్నాడు.