న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్లు ఉన్నారని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. ఈ ఇద్దరూ అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని తెలిపాడు. 2023 వన్డే ప్రపంచకప్ కోసం సిద్దమవుతున్న భారత జట్టులో యువరాజ్ సింగ్, గంభీర్ పాత్ర పోషించే ఆటగాళ్లు ఎవరు? అని రవిశాస్త్రి ప్రశ్నించాడు.
2011 ప్రపంచకప్ సమయంలో గంభీర్, యువరాజ్ సింగ్తో పాటు సురేశ్ రైనా రూపంలో మొత్తం ముగ్గురు లెప్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారని, ప్రస్తుత జట్టులో టాపార్డర్లో ఆడగలిగే లెఫ్ట్ హ్యాండర్స్ ఒక్కరు కూడా లేడని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమవ్వడంతో ఉన్న ఒక్క లెఫ్టాండర్ కూడా లేకపోయాడు.

అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్కు ఇప్పటి వరకు సరైన అవకాశాలే లభించలేదు. కేఎల్ రాహుల్తో వికెట్ కీపింగ్ చేయించి అతన్ని బ్యాకప్ కీపర్గా పరిమితం చేశారు. రవీంద్ర జడేజా రూపంలో మరో లెఫ్టాండర్ ఉన్నా.. టాప్-3లో ఆడగలిగే లెఫ్టాండర్ లేకపోవడం టీమిండియాకు సమస్యగా మారింది. ఈ అంశంపై తాజాగా ఓ చానెల్తో మాట్లాడిన రవి శాస్త్రి.. లెఫ్టాండర్ అవసరాన్ని తెలియజేశాడు.
భారత జట్టుకు లెఫ్ట్ హ్యాండర్స్ సమస్య తీరాలంటే యువ ఆటగాళ్లు అయిన తిలక్ వర్మ, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్లను ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. 'టీమిండియా టాపార్డర్లో లెఫ్టాండర్ లేకపోవడం పెద్ద సవాల్గా మారనుంది. ఓపెనింగ్ జోడీలో లేకపోయినా.. టాప్-4లో ఒక లెఫ్టాండర్ ఉంటం చాలా ముఖ్యం. సాధారణంగా టాప్-6లో ఇద్దరు లెఫ్టాండర్స్ ఉంటే మంచిది.
2011 వన్డే ప్రపంచకప్ సమయంలో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనాల రూపంలో ముగ్గురు లెఫ్టాండర్స్ ఉన్నారు. 1974, 1979 ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉన్నారు. 1983 గెలిచిన భారత జట్టులోనే ఒక్కరు కూడా లెఫ్టాండర్ లేడు. 1987, 1996 ప్రపంచకప్ గెలిచిన జట్లలోనూ లెఫ్టాండర్స్ కీలక పాత్ర పోషించారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టులోనూ టాప్-6లో లెఫ్టాండర్స్ ఉన్నారు. లెఫ్టాండర్స్ ఉంటేనే టీమ్ కాంబినేషన్ సరిగ్గా ఉంటుంది.
టీమిండియాలో లెఫ్టాండార్స్ను తీసుకోవాలంటే ఇషాన్ కిషన్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి సీనియర్ ప్లేయర్లకు రిప్లేస్మెంట్గా తీసుకోవాలి'అని శాస్త్రి సూచించాడు.