
కోచ్గా రవిశాస్త్రి సక్సెస్
టీమిండియా హెడ్ కోచ్ పదవి అత్యంత విలువైనది. చాలా కాలం పాటు బీసీసీఐ విదేశీ కోచ్లనే నమ్ముకున్నా.. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. 5-6 ఏళ్ల నుంచి స్వదేశీ కోచ్లనే నియమిస్తూ వస్తోంది. అనిల్ కుంబ్లే, రవిశాస్త్రిలు హెడ్ కోచ్లుగా నియమితులయ్యారు. వారి కాలంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా రవిశాస్త్రి హెడ్ కోచ్ అయిన తర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించింది కోహ్లీసేన.
ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల్లో కూడా సిరీసులు కైవసం చేసుకుంది. 2019 ప్రపంచకప్లో సెమిస్ చేరింది. పొట్టి ప్రపంచకప్లలో కూడా మంచి ప్రదర్శనే చేసింది. ఇక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు కూడా చేరింది. రవిశాస్త్రి తన నాలుగేళ్ల పదవి కాలంలో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు.

ఐపీఎల్ జట్లతో చర్చలు
అయితే రవిశాస్త్రి పదవీకాలం ఈ ఏడాది చివర్లో యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. అంతేకాదు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ మరియు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పదవీకాలం కూడా పూర్తవనుంది. తన కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత జాతీయ జట్టుతో విడిపోవాలని యోచిస్తున్నట్లు కొంతమంది క్రికెట్ బోర్డు సభ్యులకు రవిశాస్త్రి తెలియజేశాడని సమాచారం తెలుస్తోంది. ఇతర సహాయక సిబ్బంది ఇప్పటికే పలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్లతో చేరేందుకు చర్చలు కూడా జరుపుతున్నారట. రవిశాస్త్రి కూడా ఐపీఎల్ స్టార్ జట్లతో కలిసి పనిచేసే అవకాశం ఉందని సమాచారం.

వ్యాఖ్యానం చేయనున్నాడా?
టీ20 ప్రపంచకప్ అనంతరం రవిశాస్త్రి కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. విశ్రాంతి అనంతరం రవిశాస్త్రి తన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించనున్నాడట. ఏదేమైనా మరోసారి రవిశాస్త్రి టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు సముఖంగా లేడు. 2014లో జట్టు డైరెక్టర్గా రవిశాస్త్రి ఎంపికయ్యాడు.
2016లో టీ20 ప్రపంచకప్ వరకు అదే పదవిలో కొనసాగాడు. ఆపై అనిల్ కుంబ్లే ఒక సంవత్సరం పాటు కోచ్ పదవి చేపట్టారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఉన్న విభేదాల కారణంగా కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. రవిశాస్త్రి కోచ్ పదవి చేపట్టాడు. రెండు సంవత్సరాలు విజయవంతమవ్వడంతో మరోసారి అతడినే కోచ్ పదవి వరించింది.
రాహుల్ ద్రవిడ్.. టీమిండియా హెడ్ కోచ్ అవుతారా?!

ద్రవిడ్ ఒకే అంటే మాత్రం
ఈ ఏడాది అక్టోబర్లో జరిగే టీ20 వరల్డ్ కప్తో హెడ్ కోచ్గా రవిశాస్త్రి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఇటీవల ముగిసిన శ్రీలంక సిరీస్కు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అధినేత, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను కోచ్గా నియమించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ద్రవిడ్ అందరి కంటే ముందు ఉన్నాడని ఇప్పటికే పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. రవిశాస్త్రి తన బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో ద్రవిడ్ ఒకే అంటే మాత్రం కోచ్ పదవి అతడికే దక్కనుంది. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

పదవీకాలం ముగియడంతో
ఎన్సీఏ అధినేత హోదా కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటివరకు ఈ విధులు నిర్వర్తించాడు. భారత్ బలమైన రిజర్వ్ బెంచ్ తయారు చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడని పేరున్న ద్రవిడ్.. 2019 జులై నుంచి ఎన్సీఏను నడిపిస్తున్నాడు. అతడి రెండేళ్ల పదవీకాలం ముగియడంతో.. నిబంధనల ప్రకారం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.
మరో రెండేళ్ల పొడిగింపు కోసం ద్రవిడ్ తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అదే జరిగితే అతడు తిరిగి ఎన్సీఏ అధినేతగా నియమితుడుకావడం లాంఛనమే. కానీ రవిశాస్త్రి తర్వాత భారత కోచ్గా ద్రవిడ్ రేసులో నిలుస్తాడన్న అంచనాల నేపథ్యంలో అతనేం చేయబోతున్నాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎలాగైనా బోర్డులో భాగంగా ఉంటాడు
'ఎన్సీఏ పదవి కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఈ నెల 15. రాహుల్ ద్రవిడ్ తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. కానీ రవిశాస్త్రి పదవీకాలం నవంబరులో టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనుంది. ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్ అయ్యే అవకాశం మెండుగా ఉంది. అతడు ఎలాగైనా వ్యవస్థలో భాగంగా ఉంటాడు' అని ఓ బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ద్రవిడ్ ఇటీవలే భారత పరిమిత ఓవర్ల జట్టు ప్రధాన కోచ్గా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసందే.


Click it and Unblock the Notifications












