
ముంబై: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆగస్టు 15ను చివరి తేదీగా బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 14 రాత్రి 1.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రస్తుతం ఎన్సీఏ డైరెక్టర్ పదవిలో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నారు. 'ది వాల్' ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనకు కోచ్గా వ్యవహరించారు. యువ ఆటగాళ్లను తనదైన శైలిలో ముందుకునడిపించాడు.
రాహుల్ ద్రవిడ్.. రెండేళ్ల కాలానికిగానూ 2019 జులైలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పాటు భారత అండర్-19, భారత-ఏ జట్లకు కోచ్గా వ్యవహరిస్తున్నారు. ది గ్రేట్ వాల్ ఆధ్వర్యంలో చాలామంది యువ క్రికెటర్లు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా రిజర్వ్ బెంచ్ను బలంగా తయారుచేయడంలో ద్రవిడ్ పాత్ర ఎంతో కీలకం. దీంతో ఈ పదవికి ద్రవిడ్ తిరిగి దరఖాస్తు చేసే అవకాశముంది. ఒకవేళ ద్రవిడ్ ఈసారి కూడా దరఖాస్తు చేస్తే.. ఎన్సీఏ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడం ఖాయమే.
'రాహుల్ ద్రవిడ్ ఎన్సీఏ పదవికి మరోమారు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత భారత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ భారత కోచ్గా నియామకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి' అని బీసీసీఐ సంబంధిత వర్గాలు అంటున్నాయి. 'జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా ఎంపికైన వ్యక్తి యువ ఆటగాళ్లకు సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకోవాలి. ఆటగాళ్ల సన్నద్ధత, వారి ప్రదర్శన మెరుగుపర్చడానికి కృషి చేయాలి. భారత్-ఏ, అండర్-23, అండర్-19, అండర్-16 ఆటగాళ్లు, రాష్ట్రాల అసోసియేషన్ల ప్లేయర్లకు సంబంధించి బాధ్యత ఎన్సీఏ డైరెక్టర్దే' అని బీసీసీఐ స్పష్టం చేసింది.
శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ భారత్.. ఇటీవల పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించింది. ఈ యువ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించారు. 2-1తో వన్డే సిరీస్ను గెలుపొందిన గబ్బర్ సేన.. 2-1తో టీ20 సిరీస్ను మాత్రం కోల్పోయింది. కరోనా వ్యాప్తి కారణంగా పలువురు స్టార్ ఆటగాళ్లు చివరి రెండు మ్యాచ్లకు దూరమయ్యారు. దీంతో భారత్ టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. రానున్న టీ20 ప్రపంచకప్లో భారత్ ఒకవేళ అత్యుత్తమ ప్రదర్శన చేయకపోతే రవిశాస్త్రి భారత కోచ్ పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కోచ్ పదవీకి 60 ఏళ్ల గరిష్ఠ వయసును నిర్దేశించింది బీసీసీఐ. రవిశాస్త్రికి ప్రస్తుతం 59 ఏళ్లు. అంతేకాదు కోహ్లీ-శాస్త్రిలు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలువలేదు. దీంతో టీ20 ప్రపంచకప్ గెలవడం తప్పనిసరి అయింది. లేకపోతేవేటు తప్పకపోవచ్చు.