న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కీలక సలహా ఇచ్చాడు. మైదానంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. కెమెరాలన్నీ కోహ్లీ చూట్టే ఉంటాయని, డ్రెస్సింగ్ రూమ్ వెళ్లే వరకు జాగ్రత్తగా నడుచుకోవాలన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ గొడవపై సోషల్ మీడియా వేదికగా పెను దుమారం రేగగా.. తాజాగా రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.'ఐపీఎల్ 2023 సీజన్లో గత వారంలో జరిగిన కొన్ని ఘటనల తర్వాత ధోనీ, కోహ్లీలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను పక్కా ప్రొఫెషనల్.

ధోనీ ఎక్కడుంటే అక్కడ కెమెరాలు ఉంటాయనే విషయం అతనికి బాగా తెలుసు. క్రికెట్ రంగానికి అతను చేసిన సేవలకు దక్కిన గుర్తింపు అది. సచిన్ టెండూల్కర్ కూడా అంతే. సచిన్ ఎక్కడుంటే కెమెరాలన్నీ అటు వైపే తిరుగుతాయి. ఈ ఇద్దరిలానే విరాట్ కోహ్లీ కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ప్రతీ నిమిషం గుర్తుంచుకోవాలి.
డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లే వరకూ కెమెరాలన్నీ తన చుట్టూనే తిరుగుతాయనే విషయాన్ని కోహ్లీ గ్రహించాలి. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మ్యాచ్ అయిపోయాక కెమెరాలు తనను చూస్తున్నాయనే మైండ్ సెట్ ఉంటే చాలు. అప్పుడు మన మాటలు, చేతలు అదుపులో ఉంటాయి. కెమెరాల ద్వారా మనం జనాల మనసులు గెలుచుకోవచ్చు. ఎందరికో ఆదర్శప్రాయంగా మారొచ్చు. అలాగే ఒక్క రోజులోనే విలన్ కూడా అయిపోవచ్చు. కాబట్టి కోహ్లీ కాస్త జాగ్రత్త పడితే బెటర్. బీ కేర్ఫుల్'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.