టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీనే అత్యుత్తమ రెడ్ బాల్ కెప్టెన్ అని కొనియాడాడు. ఇటీవల విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కోహ్లీ రిటైర్మెంట్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పిన రవి శాస్త్రి.. ఫిట్గా ఉన్నా మానసిక అలసటతోనే రిటైర్మెంట్ ప్రకటించాడని తెలిపాడు. రిటైర్మెంట్ ప్రకటించే వారం రోజుల ముందు తనతో మాట్లాడాడని కూడా రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు.
తాజాగా ఓ టీవీ చర్చలో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్ అని చెప్పుకొచ్చాడు.'విరాట్ కోహ్లీ అత్యుత్తమ రెడ్-బాల్ కెప్టెన్. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. విదేశాల్లోనూ విజయాలు సాధించింది. కోహ్లీ ఆట పట్ల అంకితభావం, దూకుడు, ఫిట్నెస్పై దృష్టి పెట్టడం వంటి లక్షణాలను నన్ను ఆకట్టుకున్నాయి. కోహ్లీ జట్టులోని ఆటగాళ్లను వెన్నుదట్టి ప్రోత్సహించేవాడు. కష్ట సమయాల్లో ఆటగాళ్లకు అండగా నిలిచేవాడు. మహ్మద్ షమీ విషయంలో కోహ్లీ చూపిన మద్దతును మరిచిపోలేను. జట్టులో ఫిట్నెస్ సంస్కృతిని తీసుకొచ్చిందే కోహ్లీ.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ కారణంగానే టెస్ట్ క్రికెట్కు ఆదరణ పెరిగిందని కూడా రవిశాస్త్రి చెప్పాడు. కోహ్లీ దూకుడు.. నిలకడైన ఆటతోనే ప్రేక్షకులు మళ్లీ సంప్రదాయ క్రికెట్ను చూడటం మొదలు పెట్టారని, కోహ్లీ సారథ్యంలోని భారత జట్టును చూసేందుకు జనాలు ఎదురు చూసేవారని తెలిపాడు. టెస్ట్ క్రికెట్కు కోహ్లీ కంటే గొప్ప ప్రచారకర్త లేడని అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో 123 టెస్ట్లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ సక్సెస్ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్లు గెలిచింది. అతని సారథ్యంలోనే టీమిండియా ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. ఒకసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది.