Ravi Shatri మామ మందు తాగి పడుకున్నా అయిపోవ్! ఐదో టెస్ట్ రద్దుతో భారత కోచ్పై పేలుతున్న సెటైర్స్!

హైదరాబాద్: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా ఈ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ రద్దవ్వడానికి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ట్విటర్ వేదికగా ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. రవిశాస్త్రి తాగి పడుకున్నా మ్యాచ్ రద్దయ్యేది కాదని సెటైర్లు పేల్చుతున్నారు.
కొంపముంచిన బుక్ లాంచింగ్..
టీమిండియాలో కరోనా కలకలానికి హెడ్ కోచ్ రవిశాస్త్రి 'స్టార్ గేజర్' పుస్తకావిష్కరణ కార్యక్రమమే అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి, కోహ్లీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు ఈ బుక్ లాంచింగ్ కార్యక్రమం జరగ్గా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో పాటు మరికొంతమంది టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రవిశాస్త్రి కరోనా వైరస్ బారిన పడగా అతనికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లు, ఫిజియో నితిన్ పటేల్ సైతం పాజిటీవ్ తేలారు. ఐదో టెస్ట్కు ముందు అసిస్టెంట్ ఫిజియో యోగేజ్ పర్మార్ వైరస్ బారిన పడటంతో ఆఖరి టెస్ట్ రద్దయింది.
రూల్స్ బ్రేక్ చేసి..
బయోబబుల్ నిబంధనలను అత్రిక్రమిస్తు కెప్టెన్ కోహ్లీ, రవిశాస్త్రి బుక్ లాంచింగ్ కార్యక్రమానికి ఎలా వెళ్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు భారత్ తరఫున ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారా? లేకుంటే ఫ్యామిలీ టూర్లో ఎంజాయ్ చేసేందుకా? అని నిలదీస్తున్నారు. నిబంధనలను అతిక్రమించిన కోహ్లీ, రవిశాస్త్రిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి సూచిస్తున్నారు.ఇదే తప్పిదం ఓ యువ ఆటగాడు చేస్తే అతన్ని మళ్లీ క్రికెట్ ఆడకుండా నిషేదించేవారని, కీలక సభ్యులు చేయడంతో బీసీసీఐ కూడా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత బాధ్యతారాహిత్యమా?
కీలక సిరీస్ మధ్యలో ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తారా? అని కూడా మండిపడుతున్నారు. ఈ ఇద్దరి అలసత్వం కారణంగా భారత జట్టుతో పాటు బీసీసీఐ కూడా తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా ఏం చేయలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్కు కూడా ముప్పు ఏర్పడిందని, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు మ్యాచ్లకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మామ.. బుక్ పబ్లిసిటీ కోసమా?
రవిశాస్త్రి బుక్ పబ్లిసిటీ కోసం ఏకంగా మ్యాచ్నే రద్దు చేయించాడని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక చివరి టెస్ట్లో ఆడుదామనుకున్న అశ్విన్ ఆశలను గల్లంతు చేశారని, రవిశాస్త్రి కనబడితే కుమ్ముడేననే మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. రవిశాస్త్రి బుక్ కొందామనుకున్నామని, కానీ ఇక కొనమని కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రవిశాస్త్రి ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది.
కొవిడ్ నేపథ్యంలో ఐదో టెస్టులో భారత్ తుదిజట్టుని దింపలేకపోతోందని... ఈసీబీ తొలుత పేర్కొంది. దాంతో ఈ మ్యాచ్ను భారత్ కోల్పోయినట్లు రాసుకొచ్చింది. కాసేపటి తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఈసీబీ తన ప్రకటనలో మార్పులు చేసింది. చివరికి ఈ మ్యాచ్ రద్దయినట్లుగా మాత్రమే పేర్కొంది. మరోవైపు ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు ప్రస్తుతం ఈ మ్యాచ్ జరగకపోయినా తర్వాత నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications