టెస్ట్ క్రికెట్లో టీమిండియా మేనేజ్మెంట్ ప్రయోగాలపై మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పదే పదే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడం వెనుక మేనేజ్మెంట్కు ఉన్న ఉద్దేశం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా అతనిపై విమర్శలు గుప్పించాడు. అతని ప్రయోగాలు అర్థరహితమని అభిప్రాయపడ్డాడు.
సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా దారుణంగా విఫలమైంది. రోడ్డులాంటి బ్యాటింగ్ పిచ్పై భారత బ్యాటర్లు తేలిపోయారు. ఇదే పిచ్పై సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ చేస్తే.. భారత్ మాత్రం 201 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ను 8వ స్థానంలో బ్యాటింగ్ పంపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా పేస్ ఆల్రౌండర్గా తీసుకున్న నితీష్ కుమార్ రెడ్డికి ఎక్కువగా బౌలింగ్ ఇవ్వకపోవడం.. అతను బ్యాటింగ్లో కూడా నిరాశపర్చడంతో గంభీర్పై విమర్శల దాడి పెరిగింది. అతన్ని హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలోనే టీమిండియా ఆటతీరుపై మాట్లాడిన రవిశాస్త్రి.. మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు. 'టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచన విధానమేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఈ సిరీస్ మొదలైనప్పటి నుంచి తుది జట్టు కూర్పు గురించి నాకేమి అంతు చిక్కడం లేదు. కోల్కతా టెస్ట్లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగారు. ఎక్స్ట్రా స్పిన్నర్గా తీసుకున్న వాషింగ్టన్ సుందర్తో ఒకే ఓవర్ వేయించారు. అలాంటప్పుడు మీరు స్పెషలిస్ట్ బ్యాటర్ను ఆడించాల్సింది. అలా కాకుండా సుందర్ను మూడో స్థానంలో ఆడించారు. ఈ మ్యాచ్లో అతన్ని నాలుగో స్థానంలో ఆడించకుండా 8వ స్థానంలో బ్యాటింగ్కు పంపించారు. అతన్ని అంత లోయరార్డర్ బ్యాటింగ్కు ఎలా పంపిస్తారు?'అని రవిశాస్త్రి ప్రశ్నించాడు.
ఈ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. 288 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకున్న సౌతాఫ్రికా.. టీమిండియా ఫాలో ఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 450 ప్లస్ లక్ష్యాన్ని నమోదు చేసి రెండో ఇన్నింగ్స్కు డిక్లేర్డ్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో భారత్ ఓటమి తప్పించుకోవాలంటే రెండో ఇన్నింగ్స్లో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన చేయాలి. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు.