టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలకు తాను రుణపడి ఉంటానని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ఇంగ్లండ్తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్తో 100 మ్యాచ్ల మైలు రాయి అందుకున్న అశ్విన్.. ఈ ఫీట్ సాధించిన 14వ భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
ఇక ధర్మశాల టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియా మేనేజ్మెంట్ అశ్విన్ను ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి అతని సతీమణి ప్రీతి నారయణ్, ఇద్దరు కూతుళ్లు కూడా హాజరయ్యారు. భారత ఆటగాళ్లంతా అశ్విన్కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన అశ్విన్.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

ఈ ఘనతను అందుకోవడంలో తన కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ఉందని తెలిపాడు. ఇక కుటుంబం తర్వాత తాను ఎవరికైనా ధన్యవాదాలు చెప్పాలంటే అది విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, పుజారాలకేనని చెప్పాడు. తన 100 టెస్ట్ల కెరీర్లో కోహ్లీ షార్ట్ మిడ్ వికెట్లో.. పుజారా లెగ్ స్లిప్లో.. అజింక్యా రహానే స్లిప్లో ఫీల్డింగ్ చేశారని గుర్తు చేసుకున్నాడు.
'నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు షార్ట్ మిడ్ వికెట్లో విరాట్ కోహ్లీ.. లెగ్ స్లిప్లో పుజారా, స్లిప్లో అజింక్యా రహానేలు ఫీల్డింగ్ చేసేవారు. నా ఫ్యామిలీ తర్వాత నేను ఎవరికైనా ధన్యవాదాలు తెలపాలంటే ఈ ముగ్గురికే చెప్పాలి.'అని అశ్విన్ పేర్కొన్నాడు.
అంతకుముందు తన టెస్ట్ కెరీర్ గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 'క్రికెట్ టోర్నీల్లో ఐపీఎల్కు ఉన్న ఆదరణ ప్రత్యేకం. అందుకు చాలా మంది కుర్రాళ్లు టీ20 క్రికెట్ ఆడి ఐపీఎల్లోకి రావాలనుకుంటున్నారు. వాళ్ల ఆశయం నెరవేరాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
అయితే కుర్రాళ్లందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. టెస్ట్ ఫార్మాట్ అనేది జీవితం నేర్పలేని పాఠాలను నేర్పిస్తోంది. నా దృష్టిలో టెస్ట్ క్రికెట్ అంటే.. జీవితానికి సరికొత్త అర్థాన్నిచ్చేది. ఈ ఫార్మాట్లోనే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి.. ప్రతికూలతలను ఎలా అధిగమించాలనే విషయాలు తెలుస్తాయి.
ఈ 100వ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా నా మనసులో ఎన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి. నాతో పాటు చెన్నైలో కూర్చొని ఉన్న ఓ వ్యక్తి (అశ్విన్ తండ్రి) కూడా ఉద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటాడు.
దురదృష్టవశాత్తూ.. ఆయన ఇక్కడికి రాలేదు. చిన్నతనంలో నా క్రికెట్ కిట్ బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టి.. ఆ తర్వాత నన్ను ముందు కూర్చోబెట్టుకొని కోచింగ్కు తీసుకెళ్లేవాడు. మా అమ్మ, తాత సహకారంతోనే ఆయన నన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగారు.
నా సతీమణిని పెళ్లి చేసుకునే సమయంలో ఈ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్తుందో ఆమెకు తెలియదు. అయినా ప్రతీ అడుగులో నా వెన్నంటే ఉంది. నా ఇద్దరు పిల్లలు కూడా నన్ను బాగా అర్థం చేసుకున్నారు.'అని అశ్విన్ ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా తన తండ్రి రవిచంద్రన్ పాత్రను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.