
లండన్: వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపై భారత్తో వన్డే సిరీస్ చేజార్చుకున్న జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్.. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 62 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇయాన్ మోర్గాన్ అనంతరం ఇంగ్లండ్ వన్డే సారథ్య బాధ్యతలను జోస్ బట్లర్ అందుకోగా అతనికి ఏ మాత్రం కలిసి రావడం లేదు. భారత్తో కెప్టెన్గా తొలి ఓటమిని ఎదుర్కొన్న బట్లర్.. రెండో మ్యాచ్లో గెలిచినా సిరీస్ కాపాడుకోలేకపోయాడు.
మూడో వన్డేలో పంత్ విధ్వంసంతో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. కనీసం సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్తోనైనా బట్లర్ రాత మారుతుందని అంతా భావించారు. కానీ ఆ జట్టుతోనూ ఘోర పరాజయమే ఎదురైంది. తీరికలేని షెడ్యూల్తో చికాకుకు గురైన స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్కు ముందే వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరల్డ్ కప్ అందించిన హీరోగా అతనికి విజయంతో ఘనంగా వీడ్కోలు పలకాలని భావించిన ఇంగ్లండ్కు అన్రిచ్ నోర్జ్(4/53) రూపంలో నిరాశే ఎదురైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 333 పరుగులు చేసింది.వాండర్ డసెన్ ( 117 బంతుల్లో 10 ఫోర్లతో 134) సెంచరీతో చెలరేగగా.. మార్క్రమ్ (61 బంతుల్లో 9 ఫోర్లతో 77), జానెమన్ మలన్ (77 బంతుల్లో 5 ఫోర్లతో 57) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్ రెండు వికెట్లు తీయగా.. సామ్ కరన్, బ్రిడన్, మోయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఇంగ్లండ్ 46.5 ఓవర్లలో 271 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. బెయిర్ స్టో(71 బంతుల్లో 7 ఫోర్లతో 63), జోరూట్(77 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 86) రాణించిన ఫలితం లేకపోయింది. అన్రిచ్ నోర్జ్ 4 వికెట్లకు తోడుగా షంసీ, మార్క్రమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడిలకు తలో వికెట్ దక్కింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన స్టోక్స్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లోనూ నిరాశపరిచాడు. అయినా స్టోక్స్కు అభిమానులు ఘన వీడ్కోలు పలికారు. బ్యాటింగ్ టైమ్లో ఔటై పెవిలియన్ చేరుతున్న స్టోక్స్.. ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి వీడ్కోలు పలికారు.