మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని గుజరాత్ టైటాన్స్ తాత్కలిక కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు. ప్రత్యర్థి బౌలర్ తుషార్ దేశ్పాండే ఆఖరి ఓవర్లో వేసిన యార్కర్లను ప్రశంసించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం అహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. ఈ మ్యాచ్కు శుభ్మన్ గిల్ గాయంతో దూరం కాగా.. రషీద్ ఖాన్ తాత్కలిక సారథిగా జట్టును నడిపించాడు.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రషీద్ ఖాన్.. ఆఖరి ఓవర్లో తమ విజయానికి ఒకే ఒక్క బౌండరీ అవసరమైందన్నాడు. కానీ తుషార్ పాండే అద్భుతమైన యార్కర్లు వేసాడని, అతను మిస్ చేసిన బంతిని తాను సిక్స్ కొట్టాల్సిందని, అలా చేయకపోవడం తమ ఓటమిని శాసించిందని అంగీకరించాడు. ఆ బంతికి సిక్సర్ కొట్టబోయే రషీద్ ఖాన్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.

'రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఆరంభించిన విధానం చూస్తే.. ఆ తర్వాత మేం చాలా బాగా బౌలింగ్ చేశామనిపిస్తోంది. బ్యాటింగ్లో కూడా మేం మంచి ఆరంభాన్నే అందుకున్నాం. కానీ, వరుసగా వికెట్లు కోల్పోవడం మమ్మల్ని వెనకడుగు వేసేలా చేసింది. ఆ సమయంలోనే మేం మ్యాచ్పై పట్టు కోల్పోయాం. ఇలాంటి పిచ్పై ఓవర్కు 9-10 పరుగులు చేయడం కష్టమేమీ కాదు. బౌండరీలు ఈజీగా వచ్చాయి.

అయితే మిడిల్ ఓవర్లలో వరుసగా కొన్ని వికెట్లు కోల్పోవడంతో ఆఖరి వరకు దూకుడును కొనసాగించలేకపోయాం. ప్రతి ఆటగాడికి ఒక స్వంత ప్రణాళిక ఉంటుంది. పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాలను అర్థం చేసుకుని ఆడటం ముఖ్యం. ఇది టోర్నీ ఆరంభం మాత్రమే, మేం చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం.
ఆఖరి ఓవర్లో మా మధ్య (రబాడతొ) జరిగిన సంభాషణ ఒక్కటే... మాకు కేవలం ఒక బౌండరీ అవసరమైంది. తుషార్ దేశ్పాండే అద్భుతమైన యార్కర్లు వేశాడు. అయితే అతను మిస్ చేసిన ఆ ఒక్క బంతిని నేను సిక్సర్గా మలచాల్సింది. ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఇది సుదీర్ఘమైన టోర్నీ. మేం ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్ల్లో రాణిస్తాం. శుభ్మన్ గిల్ తదుపరి మ్యాచ్కు అందుబాటులోకి వస్తాడు.'అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 55), ధ్రువ్ జురెల్(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 31) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా(2/42) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 204 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 73) హాఫ్ సెంచరీతో రాణించినా.. చివర్లో రషీద్ ఖాన్(16 బంతుల్లో 3 ఫోర్లతో 24), కగిసో రబాడ(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్(4/41) నాలుగు వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ పతనాన్ని శాసించాడు. నండ్రే బర్గర్, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండేకు తలో వికెట్ దక్కింది.
