
దుబాయ్: వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ గెలవడమే తమ ముందున్న అతిపెద్ద లక్ష్యమని అఫ్గాన్ సెన్సెషన్ సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ రషీద్ ఖాన్ అన్నాడు. తమ జట్టు ఈ ఘనత అందుకోవాలని యావత్ అఫ్గానిస్థాన్ ఆశిస్తోందన్నాడు. తాజాగా భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఈ అఫ్గాన్ సెన్సెషన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఏదో ఒక రోజు ప్రపంచకప్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
'యావత్ దేశం ఆశిస్తున్నట్లు టీ20 ప్రపంచకప్ సాధించడమే మా ముందున్న అతిపెద్ద లక్ష్యం. ఎందుకంటే టైటిల్ గెలవగలే సామర్థ్యం, నైపుణ్యం మా జట్టుకు ఉంది. ఇది సాధించగలమనే నమ్మకం మాలో కలగడమే ఆలస్యం. ప్రతిభ పరంగా మా జట్టు అద్భుతంగా ఉంది. మా జట్టులో స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు, బ్యాట్స్మెన్కు కొరత లేదు.
అగ్రశ్రేణి జట్లతో ఎక్కువగా ఆడితే మాజట్టు మరింత మెరుగవుతుంది. మేం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టీ20 ఆటగాళ్లం. ఏదో ఒకరోజు టీ20 ప్రపంచకప్ గెలుస్తాం. ఇదే మా కల. ఆ కలను సాకారం చేసుకునేలా కృషిచేస్తాం. ఆ క్షణమే అఫ్గాన్ క్రికెట్కు, మాకు అతిపెద్ద విజయం దక్కినట్లు'అని రషీద్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్దమవుతున్న రషీద్.. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఆర్సీబీతో సెప్టెంబర్ 21న జరిగే మ్యాచ్తో సన్రైజర్స్ హైదరాబాద్ తమ ఐపీఎల్ జర్నీ ప్రారంభించనుంది. ఇక అఫ్గాన్ గత రెండు మూడేళ్లలో చాలా మెరుగైంది. వన్డే ప్రపంచకప్లో భారత్, శ్రీలంక, పాకిస్థాన్ ఓడించినంత పనిచేసింది.