అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) చేతిలో ఎదురైన ఓటమి తమకు ఓ గుణ పాఠం లాంటిదని గుజరాత్ టైటాన్స్ తాత్కలిక కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు. ఈ మ్యాచ్లో తాము ఓడినా.. అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజా లభించిందన్నాడు. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్నందుకుంది.
చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో రింకూ సింగ్.. వరుసగా ఐదు సిక్స్లు బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రషీద్ ఖాన్.. రింకూ సింగ్పై ప్రశంసల జల్లు కురిపించాడు. అతను అసాధారణమైన షాట్స్ ఆడాడని కొనియాడాడు.

'ఇది మాకు చాలా కఠినమైన మ్యాచ్. ఓ కెప్టెన్గా నాకు మరింత బాధపెట్టే ఫలితం. చివరి ఓవర్లో 30 పరుగులను డిఫెండ్ చేయలేకపోయాం. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితిని మేం ఎదుర్కొన్నాం. కానీ ఆ మ్యాచ్లో మేం గెలిచాం. ఈ ఓటమి నుంచి మేం చాలా నేర్చుకున్నాం. మొత్తానికి ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది.
ఇందులో యశ్ దయాల్ తప్పు కూడా ఏం లేదు. ప్రణాళికలకు తగ్గట్లే అతను బౌలింగ్ చేశాడు. కానీ రింకూ సింగ్ అసాధారణ షాట్స్ ఆడాడు. ఈ విజయం క్రెడిట్ అతనిదే. అతను ఆడిన విధానం.. మ్యాచ్ ముగించిన తీరు అద్భుతం. టీ20ల్లో సరైన ప్రదేశంలో బంతిని హిట్ చేయడం చాలా ముఖ్యం.
ఓ బౌలర్గా నేనెప్పుడూ సరైన ప్రదేశంలో బంతులేయడానికి ప్రయత్నిస్తుంటాను. బ్యాటింగ్లో మాకు కావాల్సిన లక్ష్యం దక్కింది. మా బౌలింగ్తో ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ టీ20ల్లో కొన్నిస్లారు 250 పరుగుల లక్ష్యం కూడా సరిపోదు. ఈ మ్యాచ్లో సానుకూలంశాలను తీసుకొని ముందుకు కొనసాగాల్సి ఉంది.
టోర్నీ ఆరంభంలోనే ఉన్నాం కాబట్టి.. ఈ ఓటమితో వచ్చే నష్టమేం లేదు. టీమ్ మోరల్ను కూడా ఇదేం దెబ్బతీయదు. టీ20 క్రికెట్లో ఇలాంటి ఫలితాలు ఎదురవ్వడం సహజం. ఇలాంటి ఫలితాలు ఆటగాళ్లను మరింత మెచ్యూర్గా మారుస్తాయి. ఐపీఎల్ కెప్టెన్సీ నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఓ ఆటగాడిగా.. ప్లేయర్గా ఈ మ్యాచ్ నాకు ఓ గుణపాఠం'అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.