
దుబాయ్: అఫ్గానిస్థాన్ టీమ్ విజయాన్ని కోరుకుంటూ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై రషీద్ ఖాన్ తెలుగులో బదులిచ్చాడు. రషీద్ తెలుగులో ట్వీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ గాయం నేపథ్యంలో వీరి మధ్య జరిగిన సంభాషణకు ప్రాధాన్యత సంతరించుకుంది. టీ20 ప్రపంచకప్లో ఫేవరేట్ బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ స్కాట్లాండ్తో జరిగిన తమ ఫస్ట్ మ్యాచ్లో 130 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఆ వెంటనే పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో పోరాడి విజయం ముంగిట బోల్తా పడింది. అనంతరం నమీబియా 62 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన అప్గాన్.. భారత్పై మళ్లీ విఫలమైంది. 66 పరుగుల తేడాతో చిత్తయింది. దాంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు భారత్ సైతం పాక్, న్యూజిలాండ్ చేతిలో వరుగా ఓడి అవకాశాలను దెబ్బతీసుకుంది. ఈ క్రమంలోనే భారత్ సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్ను అఫ్గాన్ ఓడించాలి. ఈ నేపథ్యంలోనే అఫ్గానిస్థాన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గాన్ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. అవసరమైతే టీమిండియా ఫిజియోలను కూడా పంపిస్తామని చమత్కరించాడు.
'అఫ్గాన్తో మ్యాచ్ చాలా సరదాగా సాగింది. మేం సెమీస్ చేరాలంటే అఫ్గాన్.. న్యూజిలాండ్ను ఓడించాలి. వాళ్లకి ఆల్ ది బెస్ట్. కావాలంటే మేం ముజీబ్ ఫిట్గా ఉండేందుకు ఫిజియో అవసరం కావాలంటే పంపించడానికి సిద్దంగా ఉన్నాం. ఎలాగైనా అతన్ని ఆడించాలి. ఇప్పుడు మా ఆశలు వారిపైనే'అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ట్వీట్ చేయగా.. రషీద్ స్పందించాడు.
'దిగులు చెందకు అశ్విన్ భాయ్.. మా టీమ్ ఫిజియో ప్రశాంత్ పంచాడా ముజీబ్ను చూసుకుంటున్నారు.'అని ట్వీట్ చేశాడు. దాంతో తెలుగు నెటిజన్ల అంతా అవాక్కయ్యారు. అశ్విన్ తెలుగువాడని పొరబడి రషీద్ ఈ ట్వీట్ చేసుంటాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
అఫ్గానిస్థాన్ టీమ్కు ఫిజియోగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ మన తెలుగువాడే. ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్, టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ దగ్గర కొన్ని తెలుగు పదాలు కూడా నేర్చుకున్నట్లు తెలుస్తోంది.