భారత్-పాక్ మ్యాచ్ అనంతరం..
కొత్తగా వచ్చే రెండు జట్లు వివరాలను భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం అక్టోబర్ 25( సోమవారం)న బీసీసీఐ ప్రకటించనుంది. అయితే ఈ రెండు కొత్త జట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ బిడ్ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. బిడ్డింగ్లో పాల్గొనేందుకు నాన్ రిఫెండబుల్ ఫండ్ రూ. 10 లక్షలు చెల్లించి ఇన్విటేషన్ టు టెండర్ అప్లికేషన్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఫార్ములా వన్ మాజీ ఓనల్ సీవీవీ పార్ట్నర్స్ కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీ రేసులో నిలిచినట్లు తెలుస్తోంది.
రేసులో బాలీవుడ్ హాట్ కపుల్..
ఇక భారత్లో కూడా బడా కార్పోరేట్ కంపెనీలు ఈ క్యాచ్ రిచ్ లీగ్పై కన్నేసాయి. అయితే బాలీవుడ్ హాట్ కపుల్ రణ్వీర్ సింగ్-దీపికా పదుకునే సైతం ఐపీఎల్లో కొత్త జట్టును దక్కించుకునే రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బడా వ్యాపారి అదానితో కలిసి ఈ బాలీవుడ్ హాట్ కపుల్ జతకట్టినట్లు బాలీవుడ్ టౌన్లో వార్తలు షికారు చేస్తున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలను బాలీవుడ్ తారలు దక్కించుకోవడం ఇదేం కొత్తకాదు. కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీల్లో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల పెట్టుబడులు ఉన్నాయి.
ఐపీఎల్కు సినీ గ్లామర్ కొత్తేం కాదు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన స్నేహితురాలు జూహీ చావ్లాతో కేకేఆర్ను కొనుగోలు చేయగా.. సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింతా పంజాబ్ కింగ్స్ సహయజమానురాలిగా కొనసాగుతుంది. శిల్పాశెట్టికి రాజస్థాన్ రాయల్స్లో వాటా ఉంది. దీపికా-రణ్వీర్కు కొత్త జట్టు లభిస్తే లీగ్కు మరింత గ్లామర్ పెరగనుంది. గతంలో దీపికా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్కు ప్రచారకర్తగా వ్యవహరించింది. విజయ్ మాల్యాతో కలిసి గ్యాలరీలో చిందేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఐపీఎల్ సంబంధిత వార్తల్లో ఆమె పేరు వినిపిస్తోంది.
దీపికా బ్యాడ్మింటన్ ప్లేయర్..
దీపికా, రణ్వీర్లకు క్రీడలతో వీడదీయరాని బంధం ఉంది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకునే కూతురే దీపికా. ఆయన గతంతో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గెలిచాడు. దీపికా సైతం జాతీయ స్థాయి వరకు బ్యాడ్మింటన్ ప్లేయర్గా రాణించింది. ఇక రణ్వీర్ సింగ్.. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, ఏన్బీఏ లీగ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 83 సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు.