ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్తో శార్దూల్ ఠాకూర్ దుమ్మురేపుతున్నాడు. జమ్మూ కశ్మీర్తో జరిగిన గత మ్యాచ్లో శతక్కొట్టిన శార్దూల్ ఠాకూర్.. మేఘాలయతో జరుగుతున్న తాజా మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో అతని పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
జమ్మూ కశ్మీర్తో జరిగిన గత మ్యాచ్లో స్టార్ ఆటగాళ్లంతా విఫలమైన వికెట్పై శార్దూల్ ఠాకూర్ 51, 119 పరుగులతో రాణించాడు. బౌలింగ్లో రెండు వికెట్లు తీసాడు. మేఘాలయతో జరుగుతున్న తాజా మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ వికెట్ సాయంతో (4/43) నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో ఈ మ్యాచ్లో ముంబై భారీ స్కోర్ దిశగా సాగుతోంది.

గాయాలతో దూరం..
రంజీ ట్రోఫీలో శార్దూల్ ఠాకూర్ సంచలన ప్రదర్శనతో అతను టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు టీమిండియాలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగిన శార్దూల్ ఠాకూర్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యలు ఉండటంతో సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు.
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టడంతో శార్దూల్ ఠాకూర్కు అవకాశాలు లేకుండా పోయాయి. గంభీర్.. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆటగాళ్లపై ఫోకస్ పెట్టడంతో శార్దూల్ ఠాకూర్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. అతని స్థానంలో యువ బ్యాటింగ్ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నాడు.
నితీష్ కుమార్ రెడ్డి రాణించినా..
ఈ అవకాశాన్ని తెలుగు తేజం రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. మెల్బోర్న్ టెస్ట్లో అసాధారణ ప్రదర్శనతో శతకం సాధించాడు. కానీ బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. ఇది జట్టు పతనాన్ని శాసించింది. బౌలింగ్లో బుమ్రా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. సంజయ్ మంజ్రేకర్ వంటి మాజీ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులో నుంచి తొలగించాలని, అతను బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడని తెలిపాడు.
ఇక శార్దూల్ ఠాకూర్ సంచలన ప్రదర్శన కనబరుస్తుండటంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసి ఉంటే టీమిండియా గెలిచేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన 2020-21లో టీమిండియా విజేతగా నిలవడంలో శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించాడని గుర్తు చేస్తున్నారు. విదేశీ పిచ్లపై అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్లో రాణించే ప్లేయర్ శార్దూల్ మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే అతను జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై వేటు పడనుంది. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి పక్కటెముకల గాయంతో జట్టుకు దూరమయ్యాడు.