ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేస్ ఆల్రౌండర్, ముంబై క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ జోరు కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ శతకంతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్లో 101 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును శార్దూల్ ఠాకూర్ మరోసారి ఆదుకున్నాడు. 105 బంతుల్లో 15 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు.
తొలి ఇన్నింగ్స్లోనూ శార్దూల్ ఠాకూర్ 51 పరుగులు చేసిన విషయం తెలిసిందే. శార్దూల్ సెంచరీతో ముంబై భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 67 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్(119 బంతుల్లో 17 ఫోర్లతో 113) సెంచరీతో రాణించగా.. తనూష్ కోటియన్(119 బంతుల్లో 6 ఫోర్లతో 58 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

ఈ ఇద్దరూ ఇప్పటికే 8వ వికెట్కు 173 పరుగులు అజేయంగా జోడించారు. యశస్వి జైస్వాల్(26), రోహిత్ శర్మ(28) రాణించారు. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో ఆకిబ్ నబీ(3/69) మూడు వికెట్లు తీయగా.. ఉమన్ నజీర్ మిర్(2/76), యుధ్వీర్ సింగ్(2/63) రెండేసి వికెట్లు తీసారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకే ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్(57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 51), తనూష్ కోటియన్(36 బంతుల్లో 5 ఫోర్లతో 26) మినహా అంతా విఫలమయ్యారు. రోహిత్ శర్మ(3), యశస్వి జైస్వాల్(4), అజింక్యా రహానే(12), శ్రేయస్ అయ్యర్(11), శివమ్ దూబే(0) దారుణంగా విఫలమైన వికెట్పై 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన శార్దూల్ ఠాకూర్.. తనూష్ కోటియన్తో కలిసి 8వ వికెట్కు 63 పరుగులు జోడించాడు.
జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్లో 41.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్థి(5/52) ఐదు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్(2/39), శామ్స్ ములానీ(2/61) రెండేసి వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబేకి ఓ వికెట్ దక్కింది. 86 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై..శార్దూల్ ఠాకూర్తో రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఇప్పటికే ముంబై ఆధిక్యం 188 పరుగులకు చేరింది.