ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ టీమ్ తడబాటు కొనసాగుతోంది. ఆంధ్ర జట్టుతో సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 143 ఓవర్లలో 9 వికెట్లకు 448 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఆంధ్ర యువ బ్యాటర్, కెప్టెన్ షేక్ రషీద్(372 బంతుల్లో 28 ఫోర్లతో 203) డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. కరణ్ షిండే(221 బంతుల్లో 12 ఫోర్లతో 109) శతకంతో రాణించాడు. శ్రీకర్ భరత్(59 బంతుల్లో 3 ఫోర్లతో 33), యార సందీప్(73 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33) పర్వాలేదనిపించారు.

హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి(4/137) నాలుగు వికెట్లు తీయగా.. చామ మిలింద్, రక్షణ్ రెడ్డి రెండేసి వికెట్లు పడగొట్టారు. తనయ్ త్యాగరాజన్ ఓ వికెట్ తీసాడు. ప్రస్తుతం ఆంధ్ర 147 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 301 పరుగులకు ఆలౌటైంది. తన్మయ్ అగర్వాల్(287 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 159) సెంచరీతో చెలరేగగా.. అభిరత్ రెడ్డి(114 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 35) అతనికి అండగా నిలిచాడు. కొడిమెల హిమతేజ(54 బంతుల్లో 7 ఫోర్లతో 36) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు విషలమయ్యారు.
రోహిత్ రాయుడు(0) డకౌటవ్వగా.. కెప్టెన్ రాహుల్ సింగ్(1) తీవ్రంగా నిరాశపరిచాడు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురణ విజయ్(5/118) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ రషీ రెండు వికెట్లు తీసాడు. శశికాంత్, లలిత్ మోహన్, యార సందీప్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. రంజీ ట్రోఫీ గ్రూప్-బీలో ఉన్న హైదరాబాద్, ఆంధ్ర జట్లు..నిరాశజనక ప్రదర్శన చేస్తున్నాయి.
తాజా మ్యాచ్కు ముందు హైదరాబాద్ నాలుగు మ్యాచ్ల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది. మరో రెండింటిలో ఓటమిపాలైంది. ఆంధ్ర జట్టు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఒక మ్యాచ్ డ్రా చేసుకొని వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు డబుల్ సెంచరీతో సత్తా చాటిన షేక్ రషీద్ భారీ ధర పలికే అవకాశం ఉంది. గత సీజన్లో అతన్ని సీఎస్కే తీసుకోగా.. తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ సారి కూడా సీఎస్కేనే అతన్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.