ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25లో ముంబై ఆఖరి లీగ్ మ్యాచ్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నారు. మేఘాలయతో గురువారం నుంచి ముంబై తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కు భారత స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే శివమ్ దూబే.. ఇంగ్లండ్తో టీ20 సిరీస్ నేపథ్యంలో ముంబై జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్ రెడ్డి పక్కటెముకల గాయంతో సిరీస్ మొత్తానికి దూరమవ్వడంతో అతని స్థానంలో శివమ్ దూబేకు అవకాశం దక్కింది. ఇప్పటికే దూబే భారత జట్టుతో కలిసాడు.

మరోవైపు బీసీసీఐ వార్షిక అవార్డ్ల కార్యక్రమం నేపథ్యంలోనే రోహిత్, యశస్వి, అయ్యర్లు ముంబై ఆఖరి లీగ్ రంజీ మ్యాచ్కు దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ముంబైలో ఈ కార్యక్రమం జరగనుంది. ఫిబ్రవరి రెండో తేదీనే ఇంగ్లండ్తో వన్డే సిరీస్ క్యాంప్ నాగ్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ముంబై ఆఖరి లీగ్ మ్యాచ్కు స్టార్ ఆటగాళ్లంతా దూరంగా ఉంటారని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ మ్యాచ్ ఆడిన రోహిత్.. తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 3, రెండో ఇన్నింగ్స్లో 28 పరుగులే చేసి వెనుదిరిగాడు. అయ్యర్ 11, 17 పరుగులే చేయగా.. యశస్వి జైస్వాల్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. దాంతో జమ్మూ కశ్మీర్ ముంబైపై ఘన విజయం సాధించింది.
ప్రస్తుతం ముంబై 22 పాయింట్లతో ఉంది. మేఘాలయపై ఆ జట్టు గెలిస్తేనే నాకౌట్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ముంబై నాకౌట్ చేరాలంటే.. జమ్మూ కశ్మీర్ చేతిలో బరోడా ఓటమిపాలవ్వాలి. రోహిత్ శర్మ కారణంగా గత మ్యాచ్కు దూరంగా ఉన్న ఆయుష్ మాత్రమే, సుయాన్ష్ షెడ్గే జట్టులోకి రానున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ సూపర్ ఫామ్లో ఉన్నారు.