
గువహతి: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా(283 బంతుల్లో 33 ఫోర్లు, సిక్స్తో 240 బ్యాటింగ్) విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు. భారత సెలెక్టర్లు జట్టులోకి ఎంపిక చేయడంలేదనే కోపంతో రగిలిపోతున్న షా.. బంతిపై తన ప్రతాపాన్ని చూపించాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2022-23లో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్లో పృథ్వీ షా ఈ ద్విశతకాన్ని నమోదు చేశాడు.
235 బంతుల్లోనే పృథ్వీ షా డబుల్ సెంచరీ అందుకోవడం విశేషం. షా డబుల్ సెంచరీతో ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగిన ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 2 వికెట్లకు 397 పరుగులు చేసింది. క్రీజులో పృథ్వీ షాతో పాటు కెప్టెన్ అజింక్యా రహానే(140 బంతుల్లో 5 ఫోర్లతో 73 బ్యాటింగ్) ఉన్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అస్సాం ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై బ్యాటింగ్కు దిగింది.
ఓపెనర్లు పృథ్వీ షా, ముషీర్ ఖాన్ తొలి వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభాన్ని అందించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన అర్మాన్ జాఫర్(27)ధాటిగా ఆడిన పృథ్వీ షా 107 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అర్మాన్ జాఫర్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి ముంబై స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో భారత సెలెక్టర్లకు తాను సిద్దంగా ఉన్నానని సందేశం పంపాడు. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో పృథ్వీ షా రాణిస్తున్నా.. అతనికి భారత జట్టులో చోటు దక్కడం లేదు.

ధాటిగా ఆడగలిగే పృథ్వీ షాను జట్టులోకి తీసుకోవాలని, అతన్ని జట్టుకు అనుగుణంగా తీర్చి దిద్దుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్లు సూచిస్తున్నా.. సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. పృథ్వీ షా వంటి డేంజరస్ ఓపెనర్ జట్టులో ఉండటం చాలా కీలకమని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. పవర్ ప్లేలోనే ప్రత్యర్థికి చేయాల్సిన నష్టం పృథ్వీ షా చేస్తాడని, అతనికి అండగా నిలవాలని కోరుతున్నారు. ఈ డబుల్ సెంచరీతోనైనా సెలెక్టర్లు కళ్లు తెరుస్తారో లేక.. జిడ్డు బ్యాటింగ్తో సతాయించే రాహుల్, శుభ్మన్ గిల్ కోసం పక్కనబెడతారో చూడాలి!అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.