ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25లో ముంబైకి ఊహించని పరాజయం ఎదురైంది. జమ్మూ కశ్మీర్తో శనివారం ముగిసిన మ్యాచ్లో ముంబై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ముంబైకి ఇది రెండో పరాజయం. వరుస విజయాలతో జోరు మీదున్న ముంబైకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రీఎంట్రీ నష్టం చేసింది. అతనితో పాటు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా బరిలోకి దిగడంతో ఫామ్లో ఉన్న 17 ఏళ్ల దేశవాళీ క్రికెటర్ ఆయుష్ను పక్కనపెట్టారు.
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దారుణంగా విఫలమయ్యారు. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్ 49 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి గెలుపొందింది.'

అంతకుముందు 274/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన ముంబై 290 పరుగులకు ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్(135 బంతుల్లో 18 ఫోర్లతో 119) సెంచరీతో రాణించగా.. తనూష్ కోటియన్(136 బంతుల్లో 6 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కానీ జమ్మూ కశ్మీర్ బ్యాటర్లు సమష్టిగా రాణించి సంచలన విజయాన్ని అందుకున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 120 పరుగులకే కుప్పకూలింది. అనంతరం జమ్మూ కశ్మీర్ 206 పరుగులు చేసి 86 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆధిక్యం ఆ జట్టుకు కలిసొచ్చింది.
గ్రూప్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన ముంబై 3 మ్యాచ్లు గెలిచి మరో రెండింటిలో ఓటమిపాలైంది. ఓ మ్యాచ్ డ్రా అయ్యింది. ఈ గ్రూప్లో జమ్మూ కశ్మీర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.