ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. వాంఖడే వేదికగా విదర్భ జట్టుతో జరుగుతున్న ఫైనల్లో ముంబై సమష్టి ప్రదర్శన కనబరుస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 50 ఓవర్లలో 2 వికెట్లకు 141 పరుగులు చేసింది.
ఓపెనర్లు పృథ్వీ షా(11), భుపెన్ లాల్వానీ(18) విఫలమైనా.. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్(135 బంతుల్లో 3 ఫోర్లతో 51 బ్యాటింగ్), కెప్టెన్ అజింక్యా రహానే(109 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 58 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

అండర్ 19 ప్రపంచకప్ ఫామ్ను ముషీర్ ఖాన్.. రంజీ సీజన్లో కూడా కొనసాగిస్తుండగా.. ఈ సీజన్లో దారుణంగా విఫలమైన అజింక్యా రహానే కీలక ఫైనల్లో హాఫ్ సెంచరీతో తన విలువ ఏంటో చాటి చెప్పాడు. బ్యాటింగ్కు కష్టంగా ఉన్న పిచ్పై యువ ప్లేయర్తో కలిసి ముంబై ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఇప్పటికే మూడో వికెట్కు అజేయంగా 107 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.
విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్, హర్ష్ దుబే తలో వికెట్ తీసారు. అంతకుముందు 31/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన విదర్భ.. ముంబై బౌలర్ల ధాటికి 45.3 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. అథర్వ టైడ్(23), యష్ రాథోడ్(27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో ధావల్ కులకర్ణి, షామ్స్ ములాని, తనుష్ కొటియన్ మూడేసి వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు.

తొలి ఇన్నింగ్స్లో ముంబై 224 పరుగులకు ఆలౌటైంది. మరోసారి లార్డ్ శార్దూల్ ఠాకూర్(69 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 75) ఆ జట్టును ఆదుకోగా.. పృథ్వీ షా(46) పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం ముంబై 260 పరుగుల ఆధిక్యంలో ఉంది. అనివార్య పరిస్థితుల్లో ఈ మ్యాచ్ డ్రా అయినా.. టోర్నీ నిబంధన ల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన ముంబైనే విజేతగా ప్రకటిస్తారు.