
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టు 42 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ముంబై జట్టుతో శుక్రవారం ముగిసిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన ఢిల్లీ.. సుదీర్ఘ కాలం తర్వాత ఆ జట్టుపై విజయాన్నందుకుంది. గత 42 ఏళ్లలో ముంబైపై ఢిల్లీకి ఇదే తొలి విజయం కావడం గమనార్హం. 88 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై.. ఢిల్లీ చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. తాజా సీజన్లో గ్రూప్-బిలో ఉన్న ఢిల్లీ ఐదు మ్యాచ్ల్లో మూడు డ్రా చేసుకొని, రెండింటిలో ఓడి.. ఓ విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 293 పరుగులకు ఆలౌట్ కాగా.. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఢిల్లీకి 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ముంబై 170 పరుగులకే కుప్పకూలడంతో ఢిల్లీ ముందు 97 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ముంబై తరఫున సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన అతను రెండో ఇన్నింగ్స్లో మాత్రం డకౌటయ్యాడు. కెప్టెన్ అజింక్యా రహానే, స్టార్ ఓపెనర్ పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ రవాల్(114)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై తొలి ఇన్నింగ్స్ 293 ఆలౌట్ ( సర్ఫరాజ్ ఖాన్ 125)
ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ 369 ఆలౌట్( వైభవ్ రవాల్ 114, హిమ్మత్ సింగ్ 85)
ముంబై రెండో ఇన్నింగ్స్ 170 ఆలౌట్(అజింక్యా రహానే 51, తనూష్ 50)
ఢిల్లీ రెండో ఇన్నింగ్స్ 97/2( హృతిక్ షోకీన్ 36 నాటౌట్, వైభవ్ శర్మ 36 )