పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వెటరన్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ అజింక్య రహానే అండగా నిలిచాడు. జమ్ముకశ్మీర్తో జరిగే రంజీ మ్యాచ్లో రోహిత్ రాణిస్తాడని, ఫామ్ అందుకుంటాడని తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. 5 ఇన్నింగ్స్ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ సిరీస్ను టీమిండియా 1-3తో కోల్పోయింది. ఈ ఘోర పరాజయం నేపథ్యంలో బీసీసీఐ.. ఆటగాళ్లకు 10 కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అందుబాటులో ఉండే టీమిండియా ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలనే రూల్ పెట్టింది. దాంతో రోహిత్ శర్మ రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్దమయ్యాడు. ముంబై తరఫున జమ్ముకశ్మీర్తో గురువారం నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. 10 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడు. 2015లో ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ చివరిసారిగా ఆడాడు.

జమ్ముకశ్మీర్తో మ్యాచ్ నేపథ్యంలో ముంబై కెప్టెన్ అజింక్యా రహానే బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. 'రోహిత్ శర్మ పరుగుల ఆకలితో పాటు బాగా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒక్కసారి ఫామ్ అందుకుంటే అతను చెలరేగుతాడు. ప్రాక్టీస్ సెషన్స్లో రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పేలవ ఫామ్ అనేది ప్రతీ ఆటగాడి జీవితంలో సాధారణ విషయమే. అయితే రోహిత్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు.
అంతర్జాతీయ క్రికెట్లోనూ అతని వ్యక్తిత్వం అలానే ఉంటుంది. అతని వ్యవహార శైలి కూడా చాలా కూల్గా ఉంటుంది. తన ఆట గురించి అతనికి బాగా తెలుసు. కాబట్టి ఎవరూ అతనికి బ్యాటింగ్ ఎలా చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి టచ్లోకి వస్తే పరుగుల మోత మోగిస్తాడు. అతను ఏ మాత్రం మారలేదు.'అని రహానే చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ రీఎంట్రీతో ఈ రంజీ మ్యాచ్కు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. ఈ మ్యాచ్ జరిగే మైదానంలో ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. సీట్ల సంఖ్యను కూడా పెంచారు.