
అభిమన్యు పుట్టకముందే..
అభిమన్యు ఈశ్వరన్ తండ్రి పేరు రంగనాథన్ పరమేశ్వరన్ ఈశ్వరన్. తమిళనాడుకు చెందిన రంగనాథన్ సీఏ. ఎన్నో కష్టాలకు ఓర్చి చదువుకున్న ఆయన.. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. క్రికెట్ను అమితంగా ఇష్టపడే రంగనాథన్.. డెహ్రాడూన్లో భూమి కొనుగోలు చేసి అభిమన్యు క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసి.. అదే పేరుతో స్టేడియాన్ని నిర్మించాడు.
అకాడమీ ఏర్పాటు చేసే నాటికి అభిమన్యు పుట్టనేలేదట. ఆ తర్వాత అభిమన్యు క్రికెటర్గా ఎదిగాడు. బెంగాల్ రంజీ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. భారత జట్టులోకి ఎప్పుడెప్పుడు వద్దామా? అనే ఆశతో ఉన్న అభిమన్యు ఈశ్వరన్.. రంజీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. బెంగాల్ తరఫున ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో సత్తా చాటాడు.

క్రికెట్ కోసమే కోల్కతాకు..
అభిమన్యు సెంచరీ చేసింది.. తన తండ్రి తన పేరిట నిర్మించిన గ్రౌండ్లోనే కావడం విశేషం. ఇంతకు ముందు కూడా ఆ స్టేడియంలో రంజీ మ్యాచ్లు జరిగాయి. కానీ బెంగాల్ ఆడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. తను కట్టించిన స్టేడియంలో తన కొడుకు సెంచరీ చేయడం రంగనాథన్కు ఎంతో ఆనందాన్నిచ్చింది.
అయితే రంగనాథన్ డెహ్రాడూన్లో స్డేడియం కట్టిస్తే కొడుకు బెంగాల్ తరఫున ఆడటం ఏంటనే సందేహం కలగవచ్చు. అభిమన్యు పుట్టి పెరిగింది డెహ్రాడూన్లోనే అయినప్పటికీ... అతనికి పదేళ్ల వయసున్నప్పుడు.. క్రికెటర్గా రాణించడం కోసం అన్ని రకాల సౌకర్యాలు ఉన్న కోల్కతాకు పంపించాడు అతని తండ్రి.

తండ్రి స్నేహితుడు మరణించడంతో..
ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్ అభిమన్యుకు ఎంతో ఎమోషనల్గా సాగింది. దానికి కారణం తన పేరిట నిర్మించిన స్టేడియంలో సెంచరీ చేయడం ఒక్కటే కాదు. అభిమన్యు ఫ్యామిలీ ఫ్రెండ్ (తండ్రి స్నేహితుడు) ప్రభోజిత్ సింగ్ ఈ మ్యాచ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు గుండె పోటుతో చనిపోయాడు.
సింగ్ను అభిమన్యు మామూ అని పిలుస్తాడని.. తన స్నేహితుడి అంత్యక్రియలు జరిగిన రోజే సెంచరీ చేసిన తన కొడుకు.. శతకాన్ని 'మామూ'కి అంకితం ఇచ్చాడని రంగనాథన్ మీడియాకు తెలిపారు.

బంగ్లా పర్యటనలో దక్కని అవకాశం..
టీమిండియా బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ఆడటానికి ముందే.. భారత్-ఏ తరఫున బంగ్లాలో పర్యటించిన అభిమన్యు ఈశ్వరన్.. వరుసగా రెండు సెంచరీలు బాది సత్తా చాటాడు. దాంతో బంగ్లాదేశ్తో రెండో వన్డేలో గాయపడిన రోహిత్ శర్మకు రీప్లేస్మెంట్గా అభిమన్యును బీసీసీఐ ఎంపిక చేసింది. కానీ తుది జట్టులో అతనికి అవకాశం దక్కలేదు.


Click it and Unblock the Notifications












