ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్ చరిత్ర సృష్టించింది. 57 ఏళ్ల తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఢిల్లీ జట్టును ఓడించింది. 42 సార్లు నిరాశే ఎదురైన జమ్మూకశ్మీర్కు 43వ ప్రయత్నంలో విజయం వరిచింది. మంగళవారం ముగిసిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన జమ్మూ కశ్మీర్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది.
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో జమ్మూ కశ్మీర్ బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టిగా రాణించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న జమ్మూ కశ్మీర్.. ఢిల్లీని తొలి ఇన్నింగ్స్లో 211 పరుగులకే ఆలౌట్ చేసింది. జమ్మూ కశ్మీర్ బౌలర్ ఆకీబ్ నబీ(5/16) ఐదు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని(64), ఆయుష్ దోసేజా(65), సుమిత్ మథుర్(55) హాఫ్ సెంచరీలతో రాణించారు.

అనంతరం జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ పరాస్ డోగ్రా(106) సెంచరీతో చెలరేగాడు. 99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ 69.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. ఆయుష్ బదోని(72), ఆయుష్ డోసెజా(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. వన్షాజ్ శర్మ(6/68) ఆరు వికెట్లు తీయగా.. సహిల్ లోత్రా(3/73) మూడు వికెట్లు పడగొట్టాడు. దాంతో జమ్మూ కశ్మీర్ ముందు 179 పరుగుల లక్ష్యం నమోదైంది.
జమ్మూ కశ్మీర్ 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి సునాయస విజయాన్నందుకుంది. కమ్రాన్ ఇక్బాల్(147 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్స్లతో 133) సెంచరీతో రాణించాడు. ఇరు జట్లు ఇప్పటి వరకు 42 మ్యాచ్ల్లో తలపడగా 37 సార్లు ఢిల్లీ విజయం సాధించింది. మరో 4 మ్యాచ్లు డ్రా కాగా.. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. తాజా విజయంతో జమ్మూ కశ్మీర్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. గ్రూప్డీలో ఉన్న జమ్మూ కశ్మీర్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. జమ్మూ కశ్మీర్ ప్రయాణంలో ఈ విజయం కీలక మైలురాయిగా నిలిచిపోనుంది.