ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. విదర్భతో వాంఖడే వేదికగా జరుగుతున్న ఫైనల్లో ముంబై 538 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.
టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు, అండర్ 19 సెన్సేషన్ ముషీర్ ఖాన్(326 బంతుల్లో 10 ఫోర్లతో 136) శతక్కొట్టడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 418 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముషీర్ ఖాన్కు తోడుగా.. శ్రేయస్ అయ్యర్(111 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 95), కెప్టెన్ అజింక్యా రహానే(143 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 73), షామ్స్ ములానీ(111 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 95) హాఫ్ సెంచరీలతో రాణించారు.

విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే(5/144) ఐదు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్(3/79) మూడు వికెట్లు పడగొట్టాడు. ఆధిత్య థాక్రే, అమన్ మొఖాడే తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన విదర్భ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. అనంతరం విదర్భ 105 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆ జట్టుకు 109 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్లో మెరుగ్గా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయడంతో కొండంత లక్ష్యం నమోదైంది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్లో విదర్భ గెలవలేని పరిస్థితి. చివరి రెండు రోజులు క్రీజులో నిలిచి లక్ష్యాన్ని చేధించడమే ఆ జట్టు ముందున్న కర్తవ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా.. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన ముంబైనే టైటిల్ వరించనుంది.
ముంబై తొలి ఇన్నింగ్స్: 224 ఆలౌట్
విదర్భ తొలి ఇన్నింగ్స్: 105 ఆలౌట్
ముంబై రెండో ఇన్నింగ్స్: 414 ఆలౌట్
విదర్భ రెండో ఇన్నింగ్స్: 10/0