ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో అసాధారణ ఫలితం నమోదైంది. ఎలైట్ గ్రూప్ సీలో భాగంగా కర్ణాటక వర్సెస్ గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో కర్ణాటక పేలవ బ్యాటింగ్తో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సంచలన బౌలింగ్తో గుజరాత్ స్పిన్నర్ సిద్దార్థ్ దేశాయ్ మ్యాచ్ను మలుపు తిప్పడమే కాకుండా తమ జట్టుకు చిరస్మరణీ విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 88 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన కర్ణాటక 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(109) సెంచరీతో చెలరేగగా.. మనీష్ పాండే(880 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఆ జట్టుకు 110 పరుగుల ఆధిక్యం లభించింది.

అనంతరం గుజరాత్ రెండో ఇన్నింగ్స్లో 219 పరుగులకు ఆలౌటైంది. దాంతో కర్ణాటక ముందు 110 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ స్వల్ప లక్ష్య చేధనకు దిగిన కర్ణాటక ఓ దశలో 50/0 పటిష్టంగా కనిపించింది. కానీ సిద్దార్థ్ దేశాయ్ సంచలన బౌలింగ్తో కర్ణాటక పతనాన్ని శాసించాడు. నిలకడగా ఆడిన మయాంక్ అగర్వాల్(19), దేవదత్ పడిక్కల్(31)లతో పాటు నికిన్ జోస్(4), మనీశ్ పాండే(0), విజయ్ కుమార్ వైశాఖ్(0), రోహిత్ కుమార్(0)లను సిద్దార్థ్ ఔట్ చేయగా.రింకేశ్ వెఘేలా మరో మూడు వికెట్లు తీసాడు. దాంతో 53 పరుగుల వ్యవధిలో కర్ణాటక 10 వికెట్లు కోల్పోయి గెలిచే మ్యాచ్లో ఓడింది.
అసాధారణ ప్రదర్శనతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సిద్దార్థ్ దేశాయ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. సిద్దార్థ్ స్పెల్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ వేదికగా పంచుకోగా వైరల్గా మారింది. అతనిపై నెటిజన్లు సర్వత్రా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించడం అంటే ఇదేనని కామెంట్ చేస్తున్నారు.