టీమిండియా యువ ఆల్రౌండర్ శివమ్ దూబేకు ప్రమోషన్ లభించింది. ప్రతీష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో విధ్వంసకర శతకం బాదిన మరుసటి రోజే అతనికి ముంబై జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. ఈ మేరకు ముంబై సెలెక్షన్ కమిటీ ఓ ప్రకటనను విడుదల చేసింది.
కోల్కతా వేదికగా బెంగాల్తో జరగనున్న తదుపరి రంజీ మ్యాచ్లో శివమ్ దూబే ముంబైకి వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఈ మ్యాచ్ శుక్రవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ముంబై వైస్ కెప్టెన్గా వ్యవహరించిన షామ్స్ ములాని భారత్-ఏ జట్టుకు ఎంపికవ్వడంతో దూబేకు ఆ అవకాశం దక్కింది. ఇక ముంబై జట్టును అజింక్యా రహానే నడిపిస్తున్నాడు.

'శివమ్ దూబే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సీజన్లో భారత జట్టుతో పాటు ముంబై తరఫున రాణిస్తున్నాడు. ఇది ముంబై క్రికెట్ ముందడుగు వేయడమే.'అని రాజు కులకర్ణి తెలిపాడు.
తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అజింక్యా రహానే బెంగాల్తో తదుపరి మ్యాచ్ ఆడటం సందేహంగా మారింది. అతను బరిలోకి దిగకపోతే శివమ్ దూబే ముంబైకి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ఉత్తరప్రదేశ్తో జరిగిన గత మ్యాచ్లో శివమ్ దూబే విధ్వంసకర సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ ప్రదర్శనతో సుదీర్ఘ ఫార్మాట్లో రాణించే సత్తా తనకు ఉందని భారత్ సెలెక్టర్లకు మెసేజ్ ఇచ్చాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా గైర్హాజరీలతో టీ20ల్లో సత్తా చాటిన శివమ్ దూబే.. అఫ్గానిస్థాన్తో ఇటీవల ముగిసిన సిరీస్లో దుమ్మురేపాడు. వరుసగా హాఫ్ సెంచరీలు బాదడంతో పాటు బౌలింగ్లోనూ కీలక వికెట్లు తీసాడు.
ఇప్పటికే టీమిండియా టెస్ట్ల్లో ఓ పేస్ ఆల్రౌండర్ లేక ఇబ్బంది పడుతుంది. దాంతో టీమ్ కాంబినేషన్ మేనేజ్మెంట్కు కష్టంగా మారింది. శివమ్ దూబే.. సుదీర్ఘ ఫార్మాట్లో ఇలానే నిలకడగా రాణించి.. బౌలింగ్లోనూ సత్తా చాటితే టీమిండియా టెస్ట్ టీమ్లోకి కూడా రీఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
బెంగాల్తో తలపడనున్న ముంబై జట్టు ఇదే:
అజింక్యా రహానే(కెప్టెన్), శివమ్ దూబే(వైస్ కెప్టెన్), జై బిస్తా, భుపెన్ లాల్వాణి, అమోఘ్ భక్తల్, సువెద్ పర్కార్, ప్రసాద్ పవార్, హార్దిక్ తమోర్, సుయాన్ష్ షెగ్దే, తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్, ఆదిత్య ధుమాల్, మోహిత్ అవాస్తీ, ధావల్ కులకర్ణి, రాయ్స్టాన్ దియాస్, సిల్వెస్ట్ డిసౌజా