ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ దుమ్మురేపాడు. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా కేరళతో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 124 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ యూపీనీ తనదైన బ్యాటింగ్తో ఆదుకున్నాడు.
మరో బ్యాటర్ ధృవ్ జురెల్(123 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 63) సాయంతో ఆరో వికెట్కు 143 పరుగులు జోడించాడు. 136 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 92 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్ ఆడే సామర్థ్యం కూడా తనకు ఉందని భారత సెలెక్టర్లకు సందేశాన్నిచ్చాడు. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నా.. ఉత్తరప్రదేశ్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

రింకూ సింగ్ అసాధారణ పోరాటంతో యూపీ తొలి ఇన్నింగ్స్లో 83.4 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ 2024లో భారీ ధర పలికిన యూపీ ప్లేయర్ సమీర్ రిజ్వీ(26) తీవ్రంగా నిరాశపరిచాడు. సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ రూ.8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
కేరళ బౌలర్లలో నిధీష్ మూడు వికెట్లు తీయగా.. బాసిల్ థంపి, జలజ్ సక్సెనా రెండేసి వికెట్లు తీసారు. వైశాఖ్ చంద్రన్, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీసారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన కేరళ 34 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. క్రీజులో సచిన్ బేబీతో పాటు విష్ణు వినోద్ ఉన్నారు.
గతేడాది ఐపీఎల్లో సంచలన ప్రదర్శన కనబర్చిన రింకూ సింగ్.. ఐర్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా పర్యటనలో వన్డే క్రికెట్లోకి కూడా అరంగేట్రం చేశాడు. ఈ రెండు ఫార్మాట్లలలో తనకు వచ్చిన అవకాశాలను అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు.
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ఆడటం ఒక్కటే మిగిలిపోగా.. సుదీర్ఘ ఫార్మాట్లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ రంజీ ట్రోఫీలో రింకూ సింగ్ టన్నుల కొద్దీ పరుగులు చేస్తే.. ఇంగ్లండ్తో సొంతగడ్డపై జరిగే టెస్ట్ సిరీస్ లేదా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో అవకాశాన్ని అందుకుంటాడు.