ప్రతిష్టాత్మక దేశవాళి క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ముంబై జట్టు ఫైనల్ చేరింది. తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన ముంబై ఇన్నింగ్స్ 70 పరుగులు తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 47వ సారి రంజీ ట్రోఫీ టైటిల్ ఫైట్కు ముంబై సిద్దమైంది.
శార్దూల్ ఠాకూర్(105 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్లతో 109, 2/48, 2/16)సంచలన ప్రదర్శనతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో ఫైటింగ్ సెంచరీ బాదిన శార్దూల్.. బౌలింగ్లో కీలక వికెట్లు పడగొట్టాడు.

232 పరుగుల భారీ లోటుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన తమిళనాడు రెండో ఇన్నింగ్స్లో 162 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. బాబా ఇంద్రజీత్(105 బంతుల్లో 9 ఫోర్లతో 70) మినహా అంతా విఫలమయ్యారు. వాష్టింగ్టన్ సుందర్(4), సాయి సుదర్శన్(5), విజయ్ శంకర్(24) తీవ్రంగా నిరాశపరిచారు. ముంబై బౌలర్లలో షామ్స్ ములాని(4/53) నాలుగు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, తనూష్ కోటియన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు 146 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్(138 బంతుల్లో 5 ఫోర్లతో 43), విజయ్ శంకర్(109 బంతుల్లో 8 ఫోర్లతో 44) రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్పాండే(3/24) మూడు వికెట్లు తీయగా.. ముషీర్ ఖాన్, తనూష్ కొటియాన్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మోమిత్ అవస్తీ ఓ వికెట్ తీసాడు.
ముంబై తొలి ఇన్నింగ్స్లో 378 పరుగుల భారీ స్కోర్ చేసింది. 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును సంచలన బ్యాటింగ్తో శార్దూల్ ఆదుకున్నాడు. 89 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వరుసగా 4, 6 బాది సెంచరీ సాధించాడు.
8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన శార్దూల్ ఠాకూర్.. ధనాధన్ బ్యాటింగ్తో 8వ వికెట్కు హార్దిక్ తామోర్తో కలిసి 105 పరుగులు జోడించాడు. తనుష్ కొటియాన్(38 బ్యాటింగ్) కలిసి 9వ వికెట్కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. శార్దూల్ ఔటైనా.. తుషార్ దేశ్పాండేతో కలిసి తనుష్ కొటియాన్(126 బంతుల్లో 12 ఫోర్లతో 89 నాటౌట్) చివరి వికెట్కు 88 పరుగులు జోడించాడు.
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు శార్దూల్ ఠాకూర్ సంచలన ప్రదర్శన కనబర్చడంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ఐపీఎల్ 2024 మినీ వేలంలో శార్దూల్ ఠాకూర్ను చెన్నై కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.