ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో హైదరాబాద్ ఛాంపియన్గా నిలిచింది. గతేడాది పేలవ ప్రదర్శనతో ప్లేట్ గ్రూప్లో పోటీపడిన హైదరాబాద్.. మేఘాలయ జట్టుతో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయం ద్వారా ఎలైట్ డివిజన్కు అర్హత సాధించింది. వచ్చే ఎడిషన్లో ఎలైట్ గ్రూప్లో తలపడనుంది. రన్నరప్గా నిలిచిన మేఘాలయ కూడా ఎలైట్ డివిజన్కు అర్హత సాధించింది.
ఉప్పల్ స్టేడియం వేదికగా మంగళవారం ముగిసిన ఫైనల్లో హైదరాబాద్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 198 పరుగుల సాధారణ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ తిలక్ వర్మ(64), ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(62) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన మేఘాలయ 83 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 5 వికెట్లతో సత్తా చాటగా.. రోహిత్ రాయుడు మూడు వికెట్లు తీసాడు. రిషభ్ బస్లాస్, తిలక్ వర్మకు తలో వికెట్ దక్కింది.
అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 350 పరుగులు చేసింది. నితేశ్ రెడ్డి(122), వికెట్ కీపర్ ప్రజ్ఞయ్ రెడ్డి(102) శతకాలతో రాణించారు. తిలక్ వర్మ(44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా మేఘాలయ కంటే తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
46 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మేఘాలయ.. 243 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.