ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024లో బిహార్ క్రికెట్ అసోసియేషన్ వివాదం తీవ్ర దుమారం రేపింది. బీసీఏ అంతర్గత కుమ్ములాటలు.. ప్రతిష్టాత్మక టోర్నీని వేదికగా చేసుకున్నాయి. బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్ తివారీ, సెక్రటరీ అమిత్ కుమార్ మధ్య నెలకొన్న గొడవలతో బీహార్ అసోసియేషన్ నుంచి రంజీ ట్రోఫీ ఆడేందుకు రెండు జట్లు వచ్చాయి. ఈ అనూహ్య ఘటన భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
రంజీ ట్రోఫీలో భాగంగా పట్నా వేదికగా ముంబై, బీహార్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే బీహార్ నుంచి రెండు జట్లు మ్యాచ్ ఆడేందుకు వచ్చాయి. ఒక జట్టును బిహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్ తివారీ ఎంపిక చేస్తే.. రెండో జట్టు సెక్రటరీ అమిత్ కుమార్ ఎంపిక చేశాడు. ముంబైతో ఆడేందుకు అనుమతించాలని ఈ రెండు జట్లు రిక్వెస్ట్ చేశాయి.

దాంతో మైదానంలో గందరగోళం నెలకొంది. చివరికి అధ్యక్షుడు ఎంపిక చేసిన జట్టునే రంజీ వర్గాలు అనుమతించాయి. దాంతో మ్యాచ్ ప్రారంభమైంది.
మైదానంలో గొడవకు తెరపడినా.. అధ్యక్షుడు, సెక్రటరీ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. తాము ప్రతిభ ఆధారంగా జట్టును ఎంపిక చేశామని, బిహార్ నుంచి వచ్చే ఆటగాళ్లు నైపుణ్యం చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని బీసీఏ ప్రెసిడెంట్ రాకేశ్ తివారీ తెలిపారు.
ఐపీఎల్ 2024 వేలంలో షకీబ్ హుస్సేన్ చోటు దక్కించుకున్నాడని, పన్నేండేళ్ల కుర్రాడు అరంగేట్రం చేశాడని తెలిపాడు. మరో జట్టును ప్రకటించిన కార్యదర్శి సస్పెన్షన్లో ఉన్నాడని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై సెక్రటరీ అమిత్ కుమార్ ఘాటుగా స్పందించాడు. అధ్యక్షుడు ఎక్కడా జట్టును ఎంపిక చేయడని, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ టీమ్ ఎప్పుడైనా ప్రకటించారా? అని ప్రశ్నించాడు.
బీసీసీఐ సెక్రటరీ జైషా సంతకంతోనే అన్ని ప్రకటనలు వస్తాయని గుర్తు చేశాడు. ఎన్నికల్లో విజయం సాధించిన తనను సస్పెండ్ చేసే అధికారం ప్రెసిడెంట్కు లేదన్నాడు.
ఈ గొడవ నేపథ్యంలో బీసీఏపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బిహార్ క్రికెట్ అసోసియేషన్పై చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి సూచిస్తున్నారు. ఇలాంటి గొడవల కారణంగానే ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందని, పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.