
కోల్కతా: దేశవాళీ ప్రతిష్టాత్మ టోర్నీ రంజీ ట్రోఫీ 2022-23 టైటిల్ను జయదేవ్ ఉనాద్కత్ సారథ్యంలోని సౌరాష్ట్ర సొంతం చేసుకుంది. బెంగాల్ టీమ్తో కోల్కతా వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో గెలుపొంది వరుసగా రెండో టైటిల్ను అందుకుంది. గత సీజన్ రంజీ ట్రోపీ 2021-22ని కూడా సౌరాష్ట్రనే గెలవడం విశేషం.
చివరి రోజు అయిన ఆదివారం బెంగాల్ కెప్టెన్, క్రీడా మంత్రి మనోజ్ తివారి(154 బంతుల్లో 10 ఫోర్లతో 68) చేసిన ఒంటరి పోరాటం సరిపోలేదు. జయదేవ్ ఉనాద్కత్(6/85) ఆరు వికెట్లతో చెలరేగడంతో బెంగాల్ ఓటమి ఖాయామైంది. తొలి ఇన్నింగ్స్లో (3/44) మూడు వికెట్లు తీసిన జయదేవ్ ఉనాద్కత్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో 907 పరుగులు చేసిన సౌరాష్ట్ర ప్లేయర్ అర్పిత్ వసవాడా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు అందుకున్నాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ 174 పరుగులకు కుప్పకూలింది. చేతన్ సకారియా, జయదేవ్ ఉనాద్కత్ మూడేసి వికెట్లు పడగొట్టడంతో బెంగాల్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. అర్పిత్ వసవాడ(81), షెల్డన్ జాక్సన్(59), హర్విక్ దేశాయ్(50), చిరాగ్ జెనీ(60) హాఫ్ సెంచరీలతో రాణించారు.

230 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్.. జయదేవ్ ఉనాద్కత్ ధాటికి 241 పరుగులకు కుప్పకూలింది. మరోజ్ తివాలి(68), అనుస్టప్ ముజుందార్(61) హాఫ్ సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. 12 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 2.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి చాంపియన్గా నిలిచింది. వాస్తవానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన జయదేవ్ ఉనాద్కత్.. ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐకి విజ్ఞప్తి చేసి మరీ ఈ మ్యాచ్ ఆడాడు. బెంచ్పై కూర్చోవడం కంటే తన జట్టును చాంపియన్గా నిలబెట్టడం ముఖ్యమని ఉనాద్కత్ భావించాడు.