
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2022లో బెంగాల్ జట్టు సెమీఫైనల్ చేరింది. జార్ఖండ్ జట్టుతో శుక్రవారం ముగిసిన క్వార్టర్ ఫైనల్ ఫలితం తేలకుండా ముగిసింది. దాంతో టోర్నీ నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన బెంగాల్ జట్టును విజేతగా ప్రకటించారు. బెంగాల్ క్రికెటర్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి(185 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 136) సెంచరీతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కాగా ఆటకు నేడు( శుక్రవారం) చివరి రోజు కాగా.. ఫలితం వచ్చేలా కనబడకపోవడంతో గంట ముందుగానే మ్యాచ్ను నిలిపివేశారు. ఇక ఆట ముగిసే సమయానికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. 129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బెంగాల్ను మనోజ్ తివారి తన ఇన్నింగ్స్తో నిలబెట్టాడు. 152 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో సెంచరీ మార్క్ అందుకున్న మనోజ్ తీవారి.. అభిషేక్ పోరెల్(34) తో కలిసి ఐదో వికెట్కు 92 పరుగులు జోడించాడు. ఆ తర్వాత షాబాజ్ అహ్మద్(46 పరుగులు)తో కలిసి ఆరో వికెట్కు 96 పరుగులు జోడించాడు.
అంతకుముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్ను 773 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా.. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 298 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగాల్కు 475 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. తొలి ఇన్నింగ్స్లో కూడా మనోజ్ తివారి(73) హాఫ్ సెంచరీతో రాణించాడు.
జూన్ 14-18 మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్లో బెంగాల్, మధ్యప్రదేశ్లు తలపడనున్నాయి. మరో సెమీఫైనల్లో ముంబై, ఉత్తర్ ప్రదేశ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.