
న్యూఢిల్లీ: బరోడా క్రికెటర్ విష్ణు సోలంకిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో సెంచరీతో చెలరేగిన ఈ బరోడా క్రికెటర్ను రియల్ హీరో అంటూ నెటిజన్లు, మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. చండీఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో విష్ణు సోలంకి సెంచరీ సాధించాడు. అయితే సెంచరీకే స్టార్ అవ్వడం ఏంటి? అనే సందేహం కలగవచ్చు. కానీ విష్ణు సోలంకి శతకం వెనుక పుట్టెడు దు:ఖం ఉంది. అందరికి కన్నీళ్లు తెప్పించే విషాధ గాథ ఉంది. కొద్ది రోజుల క్రితమే విష్ణు సోలంకి కూతురు చనిపోయింది. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో ఆ పసికందు కన్నుమూసింది.
ఆ సమయంలో విష్ణు రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సోలంకి.. హుటాహుటిన బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించాడు. ఆట మీద మక్కువతో బాధను దిగమింగుకొని మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. వస్తూనే సోలంకి చంఢీఘడ్తో మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు. పుట్టిన బిడ్డను కోల్పోయి కూడా సెంచరీతో మెరిసి ఔరా అనిపించిన విష్ణు సోలంకిని యావత్ క్రికెట్ ప్రపంచం మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. ''అంత బాధను దిగమింగి సూపర్ ఇన్నింగ్స్ ఆడావు.. నీ ఆటకు సలామ్'అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్నింగ్స్లు ఎన్నో ఆడాలని ఆకాంక్షిస్తున్నారు.
ఈ మ్యాచ్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన విష్ణు సోలంకి 161 బంతులెదుర్కొని 12 బౌండరీల సాయంతో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. సోలంకి సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ఆట రెండో రోజు పూర్తైంది. ప్రస్తుతం బరోడా తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. అంతకముందు చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్లో 168 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే బరోడా తొలి ఇన్నింగ్స్లో 230 పరుగుల ఆధిక్యంలో ఉండడం విశేషం. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో ఆల్రౌండర్ అయిన విష్ణు సోలంకిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు.