
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాజీ చైర్మన్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజామ్కు ఇంగ్లీష్ రాదంటూ అక్తర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. నేనే పోటుగాడిననే భ్రమలో నుంచి బయటకు రావాలని చురకలంటించాడు. ఇటీవల ఓ చానెల్తో మాట్లాడిన అక్షర్.. పాకిస్థాన్ ఆటగాళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజామ్తో పాటు చాలా మంది పాక్ ఆటగాళ్లకు ఇంగ్లీష్ రాదన్నాడు. తనతో పాటు షాహిద్ అఫ్రిదీ, వసీం అక్రమ్ మాత్రమే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతామని గొప్పలు చెప్పుకున్నాడు. ఇంగ్లీష్ రాకపోవడం వల్లే బాబర్ ఆజామ్ బ్రాండ్ అంబాసిడర్ కాలేకపోయాడని తెలిపాడు.
ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. మాజీ క్రికెటర్లు అంతా వరుసగా అక్షర్పై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే రమీజ్ రజా కాస్త ఘాటుగానే అక్తర్ను విమర్శించాడు. 'షోయబ్ అక్తర్ నా అంత పోటుగాడే లేడనే భ్రమల్లో ఉంటాడు. గతంలో కమ్రాన్ అక్మల్తోనూ అతనికి సమస్య వచ్చింది. ప్రతి ఒక్కరినీ ఏదో రకంగా బద్నాం చేయడానికే చూస్తుంటాడు. అయితే, తొలుత మనిషిగా ఉండటం ముఖ్యం. మనిషిగా మారిన తర్వాతే బ్రాండ్గా మారదాం. ఇలాంటి చెత్త స్టేట్మెంట్లతో పాక్ క్రికెట్ దిగజార్చ వద్దని కోరుతున్నా.
పొరుగు దేశంలో ఇలా జరగడం నువ్వెప్పుడూ చూసి ఉండవు. సునీల్ గవాస్కర్ వంటి క్రికెట్ దిగ్గజం ఎప్పుడూ కూడా రాహుల్ ద్రవిడ్ను విమర్శించిన దాఖలాలు లేవు. అయితే, ఇలా కేవలం పాక్లోనే జరుగుతుంది. ఆటగాళ్లను తమ విధులను సరిగ్గా చేయనీయకుండా మాజీ క్రికెటర్లు అడ్డుపుల్లలు వేస్తుంటారు. పీసీబీ ఛైర్మన్ కావాలంటే ముందు గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. అప్పుడే పోటీ చేయడానికి అర్హత ఉంటుందని తెలుసుకోవాలి'అని రమీజ్ రజా చురకలంటించాడు.
ఇటీవల బాబర్ అజామ్ మీడియా సమావేశంలో విలేకర్లపై కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దానిని, దృష్టిలో ఉంచుకునే షోయబ్ అక్తర్ విమర్శలు చేశాడు. అయితే, సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేడని వ్యాఖ్యానించడంతో మాజీలు అక్తర్పై మండిపడుతున్నారు.