
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. యూఏఈ వేదికగా అక్టోబర్లో జరిగే టీ20 ప్రపంచకప్లో భారత్తో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్లను చిత్తుగా ఓడించాలని తమ ఆటగాళ్లకు సూచించాడు. ఇందుకు ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా సిద్దంగా ఉండాలని పేర్కొన్నాడు. ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్ సరిగ్గా మ్యాచ్ ఆరంభానికి ముందే భద్రతా కారణాల వల్ల ఆడలేమని చెప్పింది. పర్యటనలో కొనసాగలేమని స్వదేశం పయనమైంది. అయితే పాక్ ఆతిథ్య మాత్రం బాగుందని, తమ ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
ఇక న్యూజిలాండ్ బాటలోనే ఇంగ్లండ్ కూడా పాకిస్థాన్లో పర్యటించేందుకు వెనుకడుగు వేసింది. దీంతో ఈ రెండు దేశాలపై రమీజ్ రాజా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇన్నాళ్లు భారత్ ఒక్కటే మన శత్రువని, ఇక నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ కూడా అని పేర్కొన్నాడు. ఇకపై ఈ జట్లను ముద్దు చేయడం మానుకుని, పాకిస్థాన్ స్వప్రయోజనాలు చూసుకోవాలని హితవుపలికాడు. రాబోయే టీ20 ప్రపంచకప్లో భారత్ను ఓడించడమే ఇప్పటిదాకా పాక్ ప్రధాన లక్ష్యమని, కానీ ఇప్పుడు తమ జట్టు కసిగా ఆడి న్యూజిలాండ్, ఇంగ్లండ్లనూ ఓడించాలని రమీజ్ రాజా పిలుపునిచ్చాడు.
'ఇంగ్లండ్ కూడా పాక్ పర్యటనను రద్దు చేసుకోవడం నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇంగ్లండ్ నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని ముందుగా ఊహించినదే. దురదృష్టవశాత్తూ ఇలాంటి పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాలు ఒకదానికి ఒకటి మద్దతుగా నిలుస్తాయి. ముందుగా తమకు తలెత్తిన ముప్పు గురించి ఏ సమాచారం ఇవ్వకుండానే న్యూజిలాండ్ వెళ్లిపోవడం మాకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడు ఇంగ్లండ్ అదేబాటలో తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ జట్లు వచ్చినపుడు బాగా ముద్దు చేసే మాకు ఇదో గుణపాఠం. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మా దేశ పర్యటనపై పునరాలోచిస్తోంది. వెస్టిండీస్ జట్టు పర్యటన మీదా ఈ పరిణామాలు ప్రభావం చూపొచ్చు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇవన్నీ ఒకే గ్రూప్కు చెందినవి. మరి మేమెవరికి ఫిర్యాదు చేయాలి. తమకు మంచి చేయని న్యూజిలాండ్, ఇంగ్లండ్లను ఓడించి వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్ ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా సిద్ధమవ్వాలి'అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్ల స్థానంలో తమతో ఆడేందుకు జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్ సిద్దంగా ఉన్నాయని రమీజ్ రాజా అన్నాడు. కానీ ఈ సిరీస్లను సర్దుబాటు చేయడానికి ఇబ్బందులు తలెత్తనున్నాయని చెప్పాడు.
పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం సైతం ఇంగ్లండ్, న్యూజిలాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తుంటే.. ఇతరులు మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తున్నారని విచారం వ్యక్తం చేశాడు. మరోసారి నిరాశే మిగిలింది. క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తుంటే.. ఇతరులు మాత్రం కాదనుకుంటున్నారు. ఈ ఎదురుదెబ్బల నుంచి బయటపడి నిలదొక్కుకోవడమే కాకుండా మరింతగా అభివృద్ధి చెందుతాం. ఇన్ షా అల్లా' అని బాబర్ ట్వీట్ చేశాడు.