
కరాచీ: సీనియర్ క్రికెటర్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్ ఆటకు వీడ్కోలు పలికితే పాకిస్థాన్ జట్టుకు మేలు జరుగుతుందని ఆ జట్టు మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. పాక్ జట్టుకు వారు చేసే గొప్ప సాయం కూడా ఇదేనని తెలిపాడు. చాలా కాలం జట్టుకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు ఇటీవలే పాక్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని ఆశిస్తున్నారు. అయితే ముందే ఆటకు గుడ్బై చెబితే జట్టుకు మరీ మంచిదని కామంటేటర్ రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. హఫీజ్ వయసు 39 ఏళ్లుకాగా.. షోయబ్ మాలిక్కు 38.
'38 ఏళ్ల మాలిక్, 39 ఏళ్ల హఫీజ్ ఇప్పుడే తమ ఆటకు అల్విదా చెబితే పాకిస్థాన్ జట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. పాకిస్థాన్లో నైపుణ్యం కలిగిన యువ ప్లేయర్లున్నారు. వారితో మంచి జట్టును సిద్దం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సుదీర్ఘకాలం ఈ ఇద్దరు క్రికెటర్లు పాక్ జట్టుకు మెరుగైన సేవలు అందించారనే విషయం తెలుసు. కానీ.. గౌరవంగా వీడ్కోలు చెప్పేందుకు వారికి ఇదే తగిన సమయమని నా ఫీలింగ్. ఒకవేళ వాళ్లు ఇప్పుడే వీడ్కోలు చెప్తే.. అది పాక్ జట్టుకు ఉపయోగపడనుంది' అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ చీఫ్ కోచ్, సెలక్టర్గా మిస్బావుల్ హక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ క్రికెటర్లు మాలిక్, హఫీజ్, ఉమర్ అక్మల్ తదితరులు మళ్లీ జట్టులోకి వచ్చారు. కానీ.. ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో.. యువ క్రికెటర్లకు అవకాశాలివ్వడం ద్వారా జట్టును సిద్ధం చేసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యోచిస్తోంది.