కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మెన్ రమీజ్ రాజాపై వేటు పడింది. సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభావాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ దేశ నాయకత్వం పీసీబీ చైర్మెన్ బాధ్యతల నుంచి రమీజ్ రాజాను తప్పిస్తూ కొత్త చైర్మన్గా నజమ్ సేథిని నియమించింది. అయితే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే రమీజ్ రాజా.. పీసీబీ చైర్మన్గా జట్టుకు చేసింది ఏం లేదని, ఇంగ్లండ్తో మూడు టెస్ట్ల సిరీస్కు సరైన పిచ్లను కూడా తయారు చేయలేకపోయాడని విమర్శలు వచ్చాయి.
అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండతో 2021 ఆగస్టులో పీసీబీ చైర్మన్గా ఎంపికైన రమీజ్ రాజా.. వివాదాస్పద నిర్ణయాలతో పాటు జట్టు వరుస ఓటములతో పదవి కోల్పోయాడు. ఇక నూతన చైర్మన్ నజమ్ సేథి నియామకాన్ని పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ఆమోదించినట్లు పాక్ మీడియా పేర్కొంది.
17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. అసాధారణ ఆటతో సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ సిరీస్లో పాకిస్థాన్ ఆట తీరు కంటే మ్యాచ్లకు ఉపయోగించిన చెత్త పిచ్లపైనే తీవ్ర విమర్శలు వచ్చాయి.
పీసీబీ చైర్మన్ తీరు పట్ల పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అసంతృప్తిగా ఉండటం, సెక్యూరిటీ విషయంలో గొడవ జరగడం.. బాబర్ ఆజామ్ నిరసన వ్యక్తం చేయడం వంటి ఘటనలు కూడా రమీజ్ రాజా పదవికి ఎసరు తెచ్చాయి. అంతేకాకుండా భారత్తో క్రికెట్ మ్యాచ్లు వంటి సున్నితమైన అంశాలపై పదే పదే మాట్లాడుతూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కూడా పీసీబీలోని పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న బీసీసీఐతో సఖ్యతో పెంచుకోవాల్సింది పోయి.. విభేదాలు పెట్టుకోవడంతో పీసీబీలోని మెజార్టీ మెంబర్స్కు నచ్చలేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పీసీబీ చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజాను తొలగించినట్లు తెలుస్తోంది.