విరాట్ కోహ్లీపై అతని చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. కోహ్లీ నిర్ణయం షాక్కు గురి చేసిందన్నారు. అయితే అది అతని వ్యక్తిగత నిర్ణయమని గౌరవిస్తానని చెప్పారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు విరాట్ కోహ్లీ కొనసాగాలని, ఆ టోర్నీ గెలవాలని రాజ్కుమార్ శర్మ ఆకాంక్షించారు. కోహ్లీ సాధించిన ఘనతకు కోచ్గా గర్వపడుతున్నానని తెలిపారు.
'విరాట్ కోహ్లీ కెప్టెన్గా భారత జట్టులో ఫిట్నెస్ సంస్కృతిని తీసుకొచ్చాడు. విదేశాల్లో విజయాలు అందించాడు. ప్రస్తుత టెస్ట్ టీమ్.. అతని గొప్ప వారసత్వం. అయితే విరాట్ కోహ్లీ మళ్లీ వైట్ జెర్సీలో కనిపించకపోవడం బాధాకరం. కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం దేశానికి ఒక భావోద్వేగ క్షణం. అయితే, ఇది కోహ్లీ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం కాబట్టి గౌరవిస్తున్నాను.

కోహ్లీ ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడే కాకుండా, ఎంతో కష్టపడే వ్యక్తి. యువ క్రికెటర్లు అతని నుంచి స్ఫూర్తి పొందాలి. కోహ్లీ దేశానికి ఎంతో చేశాడు. ఒక కోచ్గా కోహ్లీ సక్సెస్కు గర్వపడుతున్నాను. కోహ్లీ వన్డే క్రికెట్లో కొనసాగాలి. 2027 వన్డే ప్రపంచకప్ గెలవాలి. ఇదే నా కోరిక'అని రాజ్కుమార్ శర్మ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ సోమవారం భావోద్వేగభరితమైన పోస్ట్తో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. టెస్ట్ క్రికెట్ తనను ఎంతో పరీక్షించిందని, ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, ఎంతో ఇచ్చిందని.. గుండె నిండా సంతోషంతో ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నానని కోహ్లీ తన ఇన్స్టా పోస్ట్లో పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో 123 టెస్ట్లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ సక్సెస్ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్లు గెలిచింది.