
న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలో మళ్లీ పాత విరాట్ కోహ్లీని చూస్తారని అతని చిన్న నాటి కోచ్ రాజ్కుమార్ శర్మ తెలిపాడు. సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ నేపథ్యంలో ఓ చానెల్తో మాట్లాడిన రాజ్కుమార్ శర్మ.. తన శిష్యుడు విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. గత రెండేళ్లుగా భారీ స్కోర్లు చేయలేకపోతున్నా.. రిథమ్లో ఉన్నాడని, సఫారీ పర్యటనలో దుమ్ములేపుతాడని ధీమా వ్యక్తం చేశాడు. గత పర్యటనలో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబర్చాడని, ఈ సారి దాన్ని రిపీట్ చేస్తాడని చెప్పాడు.
'గత పర్యటనలో ఇదే వేదికపై కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇప్పుడూ అలాగే ఆడుతాడని ఆశిస్తున్నా. అతను ఇంతకుముందులా ఆడాలని అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అతనెంతో పరిణతి కలిగిన ఆటగాడు. ఎంతో కాలంగా టీమిండియాకు కెప్టెన్సీ చేస్తున్నాడు. అలాగే జట్టు విజయాల కోసం కట్టుబడి ఉన్నాడు. దీంతో అభిమానులు ఈసారి తనలోని పాత కోహ్లీని చూస్తారు' అని రాజ్కుమార్ చెప్పుకొచ్చాడు.
'న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో అరంగేట్రంలోనే శతకం బాది అయ్యర్ తన స్థానాన్ని పదిలపర్చుకున్నాడు. దీంతో సీనియర్లకు ఇది తలనొప్పిగా మారనుంది. కానీ, తొలి టెస్టులో ఎవరెవరితో బరిలోకి దిగుతారో ఎదురుచూడటం ఆసక్తిగా ఉంటుంది. అలాగే టీమిండియా ఈ సిరీస్ కైవసం చేసుకునేందుకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇదివరకెప్పుడూ సౌతాఫ్రికాలో భారత్ టెస్టు సిరీస్ నెగ్గలేదు. ఇప్పుడు కూడా ఆ జట్టు బౌలింగ్ దళం బలంగా ఉంది. ఇది కష్టతరమైందే అయినా టీమిండియా సిరీస్ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నా' అని కోహ్లీ చిన్ననాటి కోచ్ చెప్పుకొచ్చాడు.
ఫస్ట్ టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9 ఫోర్లతో 60), కేఎల్ రాహుల్(122 బంతుల్లో 8 ఫోర్లతో 47 బ్యాటింగ్) సూపర్ బ్యాటింగ్తో శుభారంభం అందుకుంది. అయితే సెకండ్ సెషన్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మయాంక్ అగర్వాల్ను.. లుంగి ఎంగిడి వికెట్లు ముందు బోల్తా కొట్టించడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. దాంతో 117 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా(0) గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి వేసిన మరుసటి బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి విరాట్ కోహ్లీ(7 బంతుల్లో 1 బ్యాటింగ్) రాగా.. రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు.