భారత క్రికెట్లో ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు! అధ్యక్షులు, అధికారులు కూడా మారుతుంటారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ శుక్లా మాత్రం బీసీసీఐలో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ బీజేపీ ఆధిపత్య కాలంలో రాజీవ్ శుక్లా తన పదవిని ఎలా కాపాడుకుంటున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 2011లో ఐపీఎల్ ఛైర్మెన్గా నియమితులైన రాజీవ్ శుక్లా.. ప్రస్తుతం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు.
బీసీసీఐలో ప్రభుత్వాల జోక్యం ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ.. పరోక్షంగా ప్రభావం చూపగలుగుతాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు మారగానే తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులు బీసీసీఐలో పదవులు చేపడుతారు. కానీ రాజీవ్ శుక్లా మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ.. బీసీసీఐలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. అయితే రాజీవ్ శుక్లా లైఫ్ స్టోరీ ఓ సినిమా స్టోరీని తలపిస్తోంది.

ఉత్తరప్రదేశ్కు చెందిన రాజీవ్ శుక్లా 1959 సెప్టెంబర్ 13న కాన్పూర్లో జన్మించారు. తన విద్యాభ్యాసంతో పాటు జర్నలిస్ట్గా తన కెరీర్ను అక్కడే ప్రారంభించారు. 1977లో కాన్పూర్లోని ఒక చిన్న సాయంత్రం పత్రిక 'సత్యం సంవాద్'లో రిపోర్టర్గా ఆయన కెరీర్ మొదలైంది. ఆ తర్వాత హిందీ దినపత్రిక జన్సత్తాలో రిపోర్టర్గా పనిచేశారు. రవివార్ మ్యాగ్జైన్కు ప్రత్యేక కరస్పాండేంట్గా.. పొలిటికల్ ఎడిటర్గా కూడా పనిచేశారు. 8 ఏళ్ల పాటు ఈ ఉద్యోగంలో కొనసాగారు. మరో 10 ఏళ్ల పాటు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పని చేశారు. ఈ పత్రికలో ఆయన రాసిన 'ఫ్రంట్ ఫుట్'అనే కాలమ్ పాఠకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఓ టాక్ షోకు హోస్ట్గా వ్యవహరించి రాజకీయ, సినీ, కీడ్రా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు.
జర్నలిస్ట్గా పనిచేస్తూనే రాజకీయ నాయకులతో సంబంధాలను పెంచుకున్నారు. 2000 సంవత్సరంలో అఖిల భారతీయ లోక్తాంత్రిక్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2003లో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా పని చేశారు. అతను వివిధ రాష్ట్రాలకు కో-ఆర్డినేటర్గా, పార్టీ అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) కార్యదర్శిగా.. క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ అసోసియేషన్ శాశ్వత సభ్యత్వాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ ఛైర్మన్గా(2011-13, 2015-18) బాధ్యతలు చేపట్టారు. 2020 నుంచి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. బీసీసీఐ మీడియా కమిటీ, ఫైనాన్స్ కమిటీ, ఇతర సబ్-కమిటీల్లో వివిధ కీలక పదవులు చేపట్టారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా కొనసాగుతున్నారు.
సుదీర్ఘ అనుభవం, పరిపాలనా నైపుణ్యం, రాజకీయాలకు అతీతంగా సంబంధాలు, సమర్థవంతమైన నెట్వర్కింగ్ ఉండటంతోనే ప్రభుత్వం మారినా బీసీసీఐలో రాజీవ్ శుక్లా కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రికెట్ పరిపాలనలో తలెత్తే సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో రాజీవ్ శుక్లాకు ఉన్న అనుభవం, వ్యూహాత్మక విధానం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పార్టీలకు అతీతంగా నాయకులతో సంబంధాలు, క్రికెటర్లతో ఉన్న చనువు రాజీవ్ శుక్లా పదవిని కాపాడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.