భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో భారీ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తదుపరి అధ్యక్ష ఎన్నికలు జరిగే వరకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తాత్కలిక అధ్యక్షుడిగా కొనసాగుతారని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడైన రోజర్ బిన్నీ.. సౌరవ్ గంగూలీ అనంతరం 2022 అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే జులై 19తో ఆయనకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం 70 ఏళ్లు నిండిన ఏ కార్యనిర్వాహకుడైన పదవిలో కొనసాగేందుకు అనర్హుడు. ఈ రూల్ నేపథ్యంలోనే రోజర్ బిన్నీ తన పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

65 ఏళ్ల రాజీవ్ శుక్లా తాత్కలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఆయన 2020 నుంచి బీసీసీఐ ఉపాధ్యాక్షుడిగా కొనసాగుతున్నారు. సెప్టెంబర్లో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం వరకు రాజీవ్ శుక్లా బీసీసీఐ వ్యవహారాలను చూసుకోనున్నారు. ఏజీఎం తర్వాత ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎంచుకోనున్నారు.
ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జాతీయ క్రీడా బిల్లులో జాతీయ క్రీడా సమాఖ్యల ఆఫీస్ బేరర్ల వయోపరిమితిని 75 ఏళ్లకు పెంచింది. అయితే బీసీసీఐ దాని సొంత నిబంధనల ప్రకారం పనిచేస్తున్నందున ఈ నిబంధనను మార్చలేదు. బీసీసీఐ న్యాయ బృందం ఈ విషయాన్ని అధ్యయనం చేస్తోందని పలు రిపోర్ట్స్ వచ్చాయి. బీసీసీఐ అధ్యక్ష పదవికి ముందు రోజర్ బిన్నీ పలు హోదాల్లో భారత జట్టుకు సేవలందించాడు. కోచ్గా భారత అండర్ 19 ప్రపంచకప్ 2000 గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. భారత సెలెక్టర్గా కూడా పనిచేశాడు.