రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ లేదని, ఈ సారి గెలుస్తారా? అన్న ప్రశ్నకు ఆ జట్టు కెప్టెన్ రజత్ పటీదార్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆర్సీబీకి ట్రోఫీ లేదని ఎవరూ అనలేరని, తమ మహిళల జట్టు ఒక టైటిల్ గెలిచిందని చెప్పాడు. త్వరలోనే పురుషుల జట్టు కూడా టైటిల్ అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రముఖ క్రికెట్ హోస్ట్ మయంతి లాంగర్తో జరిగిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రజత్ పటీదార్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'మాకు ఒక ట్రోఫీ ఉంది. మా మహిళల జట్టు టైటిల్ గెలిచింది. వాళ్ల విజయం ఆదర్శం. మాకు ట్రోఫీ లేదని ఎవరూ అనలేరు. నేను కెప్టెన్ అయిన తర్వాతే ఆర్సీబీ ఎంత పెద్ద ఫ్రాంచైజీ అనే విషయం తెలిసిందే. నాకు కూడా ఆర్సీబీ అంటే చాలా ఇష్టం ఉండేది. విరాట్ భాయ్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ కారణంగానే నేను ఐపీఎల్ చూడటం స్టార్ట్ చేశాను. వారిని టీవీలో చూస్తూ నేను కూడా జీవితంలో ఒక్కసారైనా ఆర్సీబీకి ఆడాలనుకునేవాడిని.'అని తెలిపాడు.

ఆర్సీబీ జట్టులోకి తాను రిప్లేస్మెంట్ ఆటగాడిగా రావాలనుకోలేదని, బ్యాకప్ ప్లేయర్గా బెంచ్పై కూర్చోవడం తనకు నచ్చదని తెలిపాడు. వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు చెప్పుకొచ్చాడు. 'ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు నిన్ను తీసుకుంటాం. రెడీగా ఉండని ఆర్సీబీ ఫ్రాంచైజీ నుంచి మెసేజ్ వచ్చింది. కానీ మెగా ఆక్షన్లో నన్ను ఆర్సీబీ కొనుగోలు చేయలేదు. దాంతో తీవ్ర కోపం వచ్చింది. బాధగా అనిపించింది. ఆ తర్వాత లవ్నిత్ సిసోడియా గాయపడటంతో నన్ను రీప్లేస్మెంట్గా తీసుకున్నారు.
నిజం చెప్పాలంటే రీప్లేస్మెంట్గా రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ నాకు ఆడే అవకాశం రాదని తెలుసు. డగౌట్లో కూర్చోవడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు' అని రజత్ పటిదార్ చెప్పుకొచ్చాడు. ఆ సీజన్లో రీప్లెస్మెంట్ ఆటగాడిగా జట్టులోకి వచ్చిన రజత్ పటీదార్ అసాధారణ ప్రదర్శనతో దుమ్మురేపాడు. ఆ తర్వాత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకొని ఈ సీజన్లో సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. 11 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్కు విజయం దూరంలో నిలిచింది.