పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్ అన్నాడు. పవర్ ప్లేలో ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసి 190 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రజత్ పటీదార్.. ఈ మ్యాచ్లో ఓడినా తమకు అనేక సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పాడు. '200 కాదు.. పవర్ ప్లే అనంతరం 190 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేయాలనుకున్నాం. కానీ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. అయితే మా ఆటగాళ్ల ఇంటెంట్ సరైనదే. కానీ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవాల్సింది కాదు.

పవర్ ప్లేలో ఒక్క వికెట్ కోల్పోవడమే ఎక్కువ. మ్యాచ్ సాగుతున్నాకొద్దీ పరిస్థితులు మెరుగయ్యాయి. ఈ చిన్న లక్ష్యాన్నైనా మా బౌలర్లు కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఛేజ్ను 18వ ఓవర్ వరకు తీసుకెళ్లారంటేనే అద్భుతం. జితేష్ శర్మ, లివింగ్ స్టోన్, టీమ్ డేవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారి బ్యాటింగ్ మాకు సానుకూలాంశం. బ్యాటింగ్ లైనప్పై మాకు నమ్మకం ఉంది. వారు పాజిటివ్ ఇంటెంట్ చూపించడం మా జట్టుకు శుభసూచకం.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్(40 బంతుల్లో ఫోర్, 5 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. జితేష్ శర్మ(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 33), టీమ్ డేవిడ్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32) దూకుడుగా ఆడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 17.2 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. జోస్ బట్లర్(39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సాయి సుదర్శన్(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 49)రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్ తలో వికెట్ తీసారు.