జోష్ హజెల్ వుడ్ అద్భుత బౌలింగ్తో పాటు భారీ లక్ష్యాన్ని నమోదు చేయడంతోనే విజయం సాధించామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 50 పరుగుల భారీ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. ఈ విజయంతో 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చెన్నై గడ్డపై విజయాన్నందుకుంది. 2008 తర్వాత చెపాక్ మైదానంలో ఆర్సీబీ విజయం సాధించడం ఇదే తొలిసారి. దాదాపు 6155 రోజుల తర్వాత ఆర్సీబీకి ఈ విజయం దక్కింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రజత్ పటీదార్.. జోష్ హజెల్ వుడ్పై ప్రశంసల జల్లు కురిపించాడు. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడని కొనియాడాడు. 'ఈ వికెట్పై మా లక్ష్యం సరిపోతుంది. బంతి ఆగుతూ రావడంతో బ్యాటింగ్కు కష్టమైంది.చెపాక్ వేదికగా చెన్నతో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎందుకంటే వారి ఫ్యాన్ బేస్ అలా ఉంటుంది. సీఎస్నే కాదు.. ప్రతీ జట్టు తమ హోమ్ టీమ్లో సంతోషంగా ఆడుతోంది.

మేం 200 పరుగులే లక్ష్యంగా పెట్టుకున్నాం. చేధన అంత సులువు కాదని మాకు తెలుసు. వీలైనంత వరకు క్రీజులో ఉంటూ.. ప్రతీ బంతిని బాదడమే నా ఏకైక లక్ష్యం. మేం మా బ్యాటింగ్ లైనప్ను ఏ మాత్రం మార్చలేదు. గత మ్యాచ్ బ్యాటింగ్ లైనప్నే కొనసాగించాం. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. దాంతో మా స్పిన్నర్లను ముందుగానే ఉపయోగించాలనుకున్నాం. లివింగ్ స్టోన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. హజెల్ వుడ్ తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి మ్యాచ్ను మా వైపు మలుపు తిప్పాడు. ఇది గేమ్ ఛేజింగ్ మూమెంటమ్. ఎందుకంటే పవర్ ప్లేలోనే మేం 2-3 వికెట్లు తీసాం. కఠినమైన లెంగ్త్ల్లో వారు బౌలింగ్ చేసిన విధానం అమోఘం.'అని రజత్ పటీదార్ కొనియాడాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసి ఓటమిపాలైంది. జోష్ హజెల్ వుడ్(3/21) మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్(2/18), లియమ్ లివింగ్ స్టోన్(2/28) రెండేసి వికెట్లు తీసారు. భువనేశ్వర్ కుమార్(1/20)కు ఒక వికెట్ దక్కింది.