బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే ఓడిపోయే మ్యాచ్లో విజయం సాధించామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్ అన్నాడు. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారని, వారి సలహాలు, సూచనలతోనే ఓటమి నుంచి గట్టెక్కామని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. తమ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామిలో ఆర్సీబీకి ఇదే తొలి విజయం. మూడు పరాజయాల తర్వాత ఈ గ్రౌండ్లో ఆర్సీబీ గెలుపు జెండా ఎగురవేసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రజత్ పటీదార్.. బౌలర్ల అసాధారణ ప్రదర్శన వల్లే గెలుపొందామని తెలిపాడు. 'ఇది మాకు అవసరమైన విజయం. ఈ రోజు పిచ్ చాలా భిన్నంగా ఉంది. మేం అంచనా వేసిన విధంగానే ఉంది. ఈ గెలుపు క్రెడిట్ మా బౌలర్లదే. 10 ఓవర్ల తర్వాత వాళ్లు అద్భుతంగా పుంజుకున్నారు. వారు చూపిన తెగువ అమోఘం. 205 పరుగుల లక్ష్యచేధనలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు.

ఒక దశలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని మేం భావించాం. వికెట్లు కోసం తెగ ప్రయత్నించాం. వికెట్లు తీస్తేనే పరుగుల ప్రవాహం అడ్డుకోవచ్చు. మా జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు. వారి ఆలోచనలు, వ్యూహాలు, సలహాలు మా విజయానికి ఉపయోగపడ్డాయి.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 70), దేవదత్ పడిక్కల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులే చేసి ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 47) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/33) నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించగా.. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. కృనాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి.