దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ఫైనల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబై వర్సెస్ మధ్య ప్రదేశ్ మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్కు టీవీ అంపైర్గా వ్యవహరించిన కేఎన్ అనంతపద్మనాభన్ ఘోర తప్పిదం చేశాడు. ఓ వైడ్ విషయంలో ముంబైకి అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించాడు.
ఈ తప్పిదంపై కన్నెర్ర చేసిన మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ బ్యాటర్ రజత్ పటీదార్.. క్రీజును వీడకుండా నిరసన తెలియజేశాడు. మరోసారి టీవీ రిప్లేలను పరిశీలించాలని పట్టు బట్టాడు. దాంతో అనంతపద్మనాభన్ మరోసారి టీవీ రిప్లేలను పరిశీలించి తన నిర్ణయాన్ని మార్చుకొని వైడ్ ఇచ్చాడు.

ఈ ఎక్స్ట్రా డెలివరీని రజత్ పటీదార్ భారీ సిక్సర్గా తరలించాడు. ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. టీవీ అంపైర్ అనంతపద్మనాభన్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. ఆఖరి ఓవర్ చివరి బంతిని ముంబై పేసర్ శార్దూల్ ఠాకూర్ స్లోగా.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్లో వేయగా.. బంతి వైడ్ మార్క్ను ధాటి వెళ్లింది. ఈ బంతిని ఆడేందుకు రజత్ పటీదార్ ముందుకు జరిగి బ్యాట్ను ఊపాడు. కానీ బంతి కనెక్ట్ కాలేదు. ఆఫ్ సైడ్ మార్క్ బయట బంతి పిచ్ అవ్వడంతో ఫీల్డ్ అంపైర్ వైడ్ ఇవ్వగా.. ముంబై రివ్యూ తీసుకుంది.
టీవీ అంపైర్ రిప్లేలను పరిశీలించి వైడ్ కాదని పేర్కొన్నాడు. బ్యాటర్ ముందుకు జరిగాడని చెప్పాడు. కానీ బంతి ఆఫ్ సైడ్ మార్క్ బయట పిచ్ అయ్యిందని, క్లియర్ వైడ్ అంటూ రజత్ పటీదార్.. ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. క్రీజును వీడకుండా నిరసనను తెలియజేశాడు. దాంతో టీవీ అంపైర్ మరోసారి రిప్లేలను పరిశీలించి వైడ్ అని ప్రకటించాడు.
'క్షమించండి.. ఔట్ సైడ్ పాపింగ్ క్రీజు బయట బంతి పిచ్ అయ్యింది. ఇది నేను చూడలేదు.'అని అనంతపద్మనాభన్ వివరణ ఇచ్చాడు. దాంతో మధ్యప్రదేశ్కు ఎక్స్ట్రా డెలివరీ లభించగా.. ముంబై రివ్యూ కోల్పోయింది. ఈ ఎక్స్ట్రా డెలివరీని రజత్ పటీదార్ సిక్సర్గా తరలించాడు.
ముంబైదే టైటిల్..
ఈ మ్యాచ్లో ముంబై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండో సారి ముస్తాక్ అలీ ట్రోఫీని ముద్దాడింది. 2022లో ఆ జట్టు తొలిసారి ఈ టైటిల్ను అందుకుంది. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. రజత్ పటీదార్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 81 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్స్టోన్ డయాస్ చెరో రెండు వికెట్లు తీయగా.. అథర్వ అంకోలేకర్, శివమ్ దూబే, సూర్యాన్ష్ షెద్గే తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్తో పాటు సుర్యాన్ష్ షెద్గే(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 36 నాటౌట్) రాణించాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేష్ సింగ్(2/34) రెండు వికెట్లు తీయగా.. శివమ్ శుక్లా, వెంకటేశ్ అయ్యర్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.